Rashid Khan-Gunatilaka: 'ఆడింది చాలు పెవిలియన్‌ వెళ్లు'.. రషీద్‌, గుణతిలక మధ్య మాటల యుద్ధం

4 Sep, 2022 10:51 IST|Sakshi

ఆసియా కప్‌ టోర్నీ ఎలాంటి గొడవలు లేకుండా సాఫీగా సాగుతుందని మనం అనుకునేలోపే ఒక ఆసక్తికర ఘటన జరిగింది. శనివారం సూపర్‌-4లో భాగంగా అఫ్గానిస్తాన్‌, శ్రీలంక మధ్య మ్యాచ్‌లో రషీద్‌ ఖాన్‌, దనుష్క గుణతిలకల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక 17 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్ల నష్టానికి 145 పరుగులతో ఆడుతోంది. గుణతిలక, రాజపక్సలు సమన్వయంతో ఆడుతూ లంకను విజయపథంవైపు నడిపిస్తున్నారు.

అప్పటికే 3 ఓవర్లు వేసి 30 పరుగులు ఇచ్చిన రషీద్‌ ఖాన్‌ ఒక్క వికెట్‌ తీయలేకపోయాడు. ఇక 17వ ఓవర్‌ రషీద్‌ ఖాన్‌ వేశాడు. వేసిన తొలి బంతినే దనుష్క బౌండరీగా మలిచాడు. అంతే ఆవేశంతో ఊగిపోయిన రషీద్‌.. దనుష్కపై పరుష పదజాలంతో విరుచుకుపడ్డాడు. తానేం తక్కువ తిన్నానా అన్నట్లుగా దనుష్క గుణతిలక కూడా రషీద్‌కు కౌంటర్‌ ఇచ్చాడు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం చోటుచేసుకోగా.. బానుక రాజపక్స వచ్చి వారిద్దరిని విడదీసి రషీద్‌కు సర్దిచెప్పాడు. అంతటితో వివాదం సద్దుమణిగింది. అయితే ఇదే ఓవర్‌ నాలుగో బంతికి గుణతిలక క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. ఇక పెవిలియన్‌ వెళ్లు అంటూ రషీద్‌ తన చేతితో గుణతిలకకు సంజ్ఞ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే..  179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టులో బ్యాటర్స్‌ అంతా సమిష్టిగా రాణించడంతో విజయాన్ని అందుకుంది.  బానుక రాజపక్స (14 బంతుల్లో 31; 4 ఫోర్లు, 1 సిక్స్‌) ధాటిగా ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మిగిలిన వారిలో నిసాంక (35; 3 ఫోర్లు, 1 సిక్స్‌), కుశాల్‌ మెండిస్‌ (19 బంతుల్లో 36; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), గుణతిలక (20 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) అదరగొట్టారు. అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్గానిస్తాన్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 175 పరుగులు సాధించింది. ఓపెనర్‌ రహ్మానుల్లా గుర్బాజ్‌ (45 బంతుల్లో 84; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు), ఇబ్రహీమ్‌ జద్రాన్‌ (40; 2 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు.

చదవండి: భారత్‌-పాక్‌ మ్యాచ్‌; నోటి దాకా వచ్చినా.. 'బూతు పదం' కావడంతో

AFG Vs SL Super-4: టి20 క్రికెట్‌లో అఫ్గానిస్తాన్‌ చెత్త రికార్డు.. ఏడేళ్లలో నాలుగోసారి

మరిన్ని వార్తలు