Ind Vs Pak: హాంగ్‌ కాంగ్‌తో మ్యాచ్‌లో చెత్త ప్రదర్శన.. అయినా వాళ్లిద్దరూ తుది జట్టులో ఉండాల్సిందే!

3 Sep, 2022 13:03 IST|Sakshi
ఆవేశ్‌ ఖాన్‌- అర్ష్‌దీప్‌ సింగ్‌(PC: BCCI)

Asia Cup 2022 Super 4 - India Vs Pakistan: ఆసియా కప్‌-2022 టోర్నీ తుది అంకానికి చేరుకుంటోంది. గ్రూప్‌- ఏ నుంచి టీమిండియా- పాకిస్తాన్‌, గ్రూప్‌- బి నుంచి అఫ్గనిస్తాన్‌- శ్రీలంక సూపర్‌-4కు చేరుకున్నాయి. ఈ క్రమంలో గ్రూప్‌- బిలోని అఫ్గన్‌- లంక జట్టు షార్జా వేదికగా సూపర్‌-4 స్టేజ్‌లో శనివారం మొదటి మ్యాచ్‌ ఆడనున్నాయి.

మరో బిగ్‌ సండే
ఆ మరుసటి రోజే మరో బిగ్‌ మ్యాచ్‌ జరుగనుంది. దుబాయ్‌ వేదికగా ఇండియా- పాకిస్తాన్‌ తలపడనున్నాయి. ఈ మెగా ఈవెంట్‌ తాజా ఎడిషన్‌లో దాయాదులు ముఖాముఖి పోటీపడటం ఇది రెండోసారి. ఫైనల్‌కు చేరే క్రమంలో కీలకమైన పోరులో చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా భారత తుది జట్టు కూర్పు ఎలా ఉంటుందన్న అంశంపై క్రీడావర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.


సబా కరీం

వాళ్లిద్దరికీ అవకాశం ఇవ్వాలి!
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ సెలక్టర్‌ సబా కరీం కీలక వ్యాఖ్యలు చేశాడు. యువ బౌలర్లు ఆవేశ్‌ ఖాన్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌కు పాక్‌ మ్యాచ్‌లో అవకాశం ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు. కాగా హాంగ్‌ కాంగ్‌తో మ్యాచ్‌లో ఈ ఇద్దరు యువ పేసర్లు తేలిపోయిన విషయం తెలిసిందే.

పసికూనతో మ్యాచ్‌లో ఆవేశ్‌ ఖాన్‌ ఏకంగా 53 పరుగులు ఇవ్వగా.. అర్ష్‌దీప్‌ 44 పరుగులు సమర్పించుకుని చెరో వికెట్‌ తీశారు. వీరిద్దరి బౌలింగ్‌లో హాంగ్‌ కాంగ్‌ బ్యాటర్లు ఏకంగా 97 పరుగులు రాబట్టారు. దీంతో వీళ్లిద్దరి ఆట తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. వీళ్లను నమ్ముకుంటే కీలక మ్యాచ్‌లలో నట్టేట ముంచుతారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

సమస్య అదే! అందుకే మునుపటి జట్టుతోనే
ఈ నేపథ్యంలో సబా కరీం మాత్రం ఆవేశ్‌ ఖాన్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌లకు అండగా నిలిచాడు. ఇండియా న్యూస్‌తో మాట్లాడుతూ.. ‘‘ఆవేశ్‌ ఖాన్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌లు ఇప్పుడిప్పుడే తమను తాము నిరూపించుకుంటున్నారు. వాళ్లు మరింత అనుభవం గడించాల్సి ఉంది. అంతేగానీ.. ఒకటీ రెండు ప్రదర్శనల కారణంగా వారిని తుది జట్టు నుంచి తప్పించడం సరికాదు. 

ఫామ్‌తో సంబంధం లేకుండా జట్టులో కచ్చితంగా ముగ్గురు సీమర్లు ఉండాల్సిందే. కాబట్టి గత మ్యాచ్‌లో ఆడించిన జట్టుతోనే ముందుకు వెళ్లాలి. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో మునుపటి జట్టును కొనసాగించాలి. ఎందుకంటే.. ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగితే.. కచ్చితంగా ఒకరికి పవర్‌ ప్లేలో ఒకటీ లేదంటే రెండు ఓవర్లు ఇవ్వాలి.

అయితే, పాకిస్తాన్‌తో మ్యాచ్‌ కాబట్టి రిస్క్‌ తీసుకోకూడదు. పాక్‌తో గత మ్యాచ్‌లో పేసర్లు అద్బుతంగా ఆడారు. అందుకే మార్పుల్లేకుండానే సూపర్‌-4 మొదటి మ్యాచ్‌ ఆడితే మంచిది’’ అని అభిప్రాయపడ్డాడు. కాగా ఆసియా కప్‌ 15 ఎడిషన్‌లో పాకిస్తాన్‌తో ఆరంభ మ్యాచ్‌లో ఆవేశ్‌ ఖాన్‌ రెండు ఓవర్లు బౌలింగ్‌ చేసి 19 పరుగులు ఇచ్చాడు. ఒక వికెట్‌(ఫఖర్‌ జమాన్‌) తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు.. అర్ష్‌దీప్‌ సింగ్‌ 3.5 ఓవర్ల బౌలింగ్‌లో 33 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు.

చదవండి: Asia Cup 2022: మరోసారి తలపడనున్న భారత్‌-పాక్‌.. సూపర్‌-4 షెడ్యూల్‌ ఇదే
Asia Cup 2022: రోహిత్‌, బాబర్‌ సేనలకు భారీ షాక్‌

Poll
Loading...
మరిన్ని వార్తలు