జ్యోతి సురేఖకు నిరాశ.. బొపన్న, సానియా జంటలకు షాక్‌!

30 Mar, 2022 09:55 IST|Sakshi

ఈ ఏడాది సెప్టెంబర్‌లో చైనాలో జరిగే ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత ఆర్చరీ జట్ల ఎంపిక కోసం నిర్వహిస్తున్న సెలెక్షన్‌ ట్రయల్స్‌లో ఆంధ్రప్రదేశ్‌ స్టార్‌ ప్లేయర్‌ జ్యోతి సురేఖ విఫలమైంది. సోనిపట్‌లో మంగళవారం జరిగిన మహిళల కాంపౌండ్‌ విభాగం ట్రయల్స్‌లో సురేఖ రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయి ఎలిమినేషన్‌ రౌండ్‌లోనే నిష్క్రమించింది. సురేఖ 2014, 2018 ఆసియా క్రీడల్లో కాంస్యం, రజతం సాధించింది.  

ఇతర క్రీడాంశాలు
బొపన్న జంట ఓటమి

కాలిఫోర్నియా: మయామి ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌ టెన్నిస్‌ టోర్నీ పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో రోహన్‌ బోపన్న (భారత్‌)–షపోవలోవ్‌ (కెనడా) ద్వయం 2–6, 1–6తో వెస్లీ కూలాఫ్‌ (నెదర్లాండ్స్‌)–నీల్‌ స్కప్‌స్కీ (బ్రిటన్‌) జోడీ చేతిలో ఓడిపోయింది. క్వార్టర్‌ ఫైనల్లో ఓడిన బోపన్న జంటకు 61,100 డాలర్ల (రూ. 46 లక్షల 19 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 180 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.

సానియా జోడీ పరాజయం 
కాలిఫోర్నియా: మయామి ఓపెన్‌ డబ్ల్యూటీఏ ప్రీమియర్‌ టెన్నిస్‌ టోర్నీ మహిళల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో సానియా మీర్జా (భారత్‌)–కిర్‌స్టెన్‌ ఫ్లిప్‌కెన్స్‌ (బెల్జియం) ద్వయం 3–6, 6–7 (3/7)తో జావోజువాన్‌ యాంగ్‌ (చైనా)–ఎకతెరీనా (రష్యా) జోడీ చేతిలో ఓడిపోయింది. 

సెమీఫైనల్లో మనిక బత్రా–అర్చన జంట 
ప్రపంచ టేబుల్‌ టెన్నిస్‌ (డబ్ల్యూటీటీ) దోహా కంటెండర్‌ టోర్నీ మహిళల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో మనిక బత్రా–అర్చన కామత్‌ (భారత్‌) ద్వయం 13–11, 8–11, 11–5, 13–11తో సూ వాయ్‌ యామ్‌–లీ హో చింగ్‌ (హాంకాంగ్‌) జోడీని ఓడించి సెమీఫైనల్‌కు చేరింది. మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో మనిక 5–11, 2–11, 4–11తో యింగ్‌ హాన్‌ (జర్మనీ) చేతిలో... పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సత్యన్‌ (భారత్‌) 11–5, 8–11, 7–11, 4–11తో కార్ల్‌సన్‌ (స్వీడన్‌) చేతిలో ఓడిపోయారు. 

చదవండి: Kane Williamson: వెయ్యిసార్లు చూసినా అదే నిజం.. చెత్త అంపైరింగ్‌! పాపం కేన్‌ మామ!

మరిన్ని వార్తలు