Lovlina Borgohain: వెల్‌క‌మ్‌ చెప్పేందుకు సిద్ధం!

4 Aug, 2021 13:58 IST|Sakshi

అసాం ప్రభుత్వం కీలక  నిర్ణయం

లవ్లీనా మ్యాచ్‌ వీక్షించేందుకు వీలుగా అసెంబ్లీ వాయిదా

లవ్లీనా గ్రామంలో​ సందడి, ఊపందుకున్న రోడ్డునిర్మాణ పనులు 

టోక్యో ఒలింపిక్స్‌ మహిళల బాక్సింగ్‌లో సెమీస్‌లోకి దూసుకొచ్చిన భారత బాక్సర్ లవ్లీనా బొర్గోహైన్‌ స్వర్ణం వేటలో నిరాశే ఎదురైంది. బుధవారం జరిగిన పోటీలో టర్కీకి చెందిన బుసేనాజ్ సుర్మెనెలీ ఓటమి పాలైంది. అయినా  కాంస్య పతకాన్ని గెల్చుకున్నలవ్లీనాపై  ‘లవ్లీ’ అంటూ అభినందనల వెల్లువ కురుస్తోంది.

మరోవైపు లవ్లీనా స్వగ్రామం అస్సాం రాష్ట్రంలోని బారోముఖియా ఆమెకు వెల్‌కం చెప్పేందుకు ఎదురు చూస్తోంది.  ఈ క్రమంలో గోలాఘాట్ జిల్లాలోని ఆమె నివాసానికి వెళ్లే రహదారి నిర్మాణ పనులు ఊపందు కున్నాయి. ఇటీవలి భారీ వర్షాలకు ఇక్కడ రోడ్లన్నీ పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో సుమారు 3.5 కిలోమీటర్ల నిర్మితమవుతున్న ఈ రోడ్డు  ఒలింపిక్స్‌ పతకంతో మురిపించిన లవ్లీనాకు వెల్‌కం చెప్పేందుకు సిద్ధమవుతోంది. దీంతో ఆ గ్రామంలో సందడి నెలకొంది. 

మరోవైపు సెమీ ఫైనల్‌ నేపథ్యంలో అసాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మ్యాచ్‌ను వీక్షించేందుకు అసెంబ్లీని వాయిదా వేయాలని నిర్ణయించింది. చారిత్రాత్మక స్వర్ణ పతకం సాధించాలని కోరుకుంటూ  తమ అభిమాన బాక్సర్‌ని ప్రత్యక్షంగా చూడటానికి అనుమతించాలని డిప్యూటీ స్పీకర్ నుమాల్ మోమిన్ స్పీకర్ బిశ్వజిత్ డైమరీని అభ్యర్థించినట్లు సంబంధిత అధికారి తెలిపారు. బౌట్ ముగిసేంతవరకు సభలోని సభ్యులందరూ, అసెంబ్లీ సిబ్బంది దీన్ని వీక్షించారు.  కాగా అస్సాం నుంచి ఒలింపిక్ పతకం సాధించిన తొలి క్రీడాకారిణి,  అలాగే ఒలింపిక్స్‌లో పాల్గొన్న రాష్ట్రం నుండి మొదటి మహిళా అథ్లెట్ కూడా లవ్లీనే కావడం విశేషం. 

కాగా టోక్యో ఒలింపిక్స్‌ మహిళల బాక్సింగ్‌ సెమీస్‌లో లవ్లీనా బొర్గోహైన్‌కు నిరాశ ఎదురైంది. టర్కీకి చెందిన బుసేనాజ్ చేతిలో ఓటమి పాలైంది.  దీంతో లవ్లీనా కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

మరిన్ని వార్తలు