సెమీస్‌లో దీపిక, అతాను దాస్‌

24 Apr, 2021 06:12 IST|Sakshi

గ్వాటెమాలా సిటీ: ప్రపంచకప్‌ ఆర్చరీ స్టేజ్‌–1 టోర్నమెంట్‌లో పురుషుల, మహిళల రికర్వ్‌ వ్యక్తిగత విభాగంలో భారత స్టార్‌ ఆర్చర్లు, భార్యభర్తలైన దీపిక కుమారి, అతాను దాస్‌ సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. మహిళల క్వార్టర్‌ ఫైనల్స్‌లో దీపిక కుమారి 6–0తో మిచెల్లి క్రాపెన్‌ (జర్మనీ)పై గెలుపొందగా... అంకిత 2–6తో అలెజాండ్రా వలెన్సియా (మెక్సికో) చేతిలో ఓడిపోయింది. పురుషుల క్వార్టర్‌ ఫైనల్లో 6–4తో ఎరిక్‌ పీటర్స్‌ (కెనడా)పై గెలుపొందాడు. భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ఆర్చర్‌ బొమ్మదేవర ధీరజ్‌ రెండో రౌండ్‌లో 5–6తో డానియల్‌ క్యాస్ట్రో (స్పెయిన్‌) చేతిలో ఓడిపోయాడు. పురుషుల టీమ్‌ విభాగం క్వార్టర్‌ ఫైనల్లో అతాను దాస్, ప్రవీణ్‌ జాదవ్, తరుణ్‌దీప్‌ రాయ్‌లతో కూడిన భారత జట్టు 4–5తో గార్సియా, క్యాస్ట్రో, పాబ్లోలతో కూడిన స్పెయిన్‌ జట్టు చేతిలో ఓడిపోయింది.  

ఫైనల్లో మహిళల జట్టు
మహిళల టీమ్‌ విభాగంలో దీపిక కుమారి, అంకిత, కోమలికలతో కూడిన భారత జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీఫైనల్లో టీమిండియా 6–0తో ఇలియా, ఇనెస్, లెరీ ఫెర్నాండెజ్‌లతో కూడిన స్పెయిన్‌పై గెలిచింది. క్వార్టర్‌ ఫైనల్లో భారత్‌ 6–0తో నాన్సీ, సింతియా, కామిలాలతో కూడిన గ్వాటెమాలా జట్టును ఓడించింది.   

మరిన్ని వార్తలు