T20 WC 2022: 'రోహిత్‌ పని అయిపోయింది.. ఆ ఇద్దరిలో ఒకరిని కెప్టెన్‌ చేయండి'

15 Nov, 2022 18:22 IST|Sakshi

టీ20 ప్రపంచకప్‌-2022 సెమీస్‌లోనే టీమిండియా ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే. టీ20 ప్రపంచకప్‌ ముగిసినప్పటికీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు జట్టు మేనేజేమెంట్‌పై కూడా ఇంకా విమర్శల వర్షం కురుస్తోంది. రాహుల్‌ ద్రవిడ్‌, రోహిత్‌ శర్మ నేతృత్వంలోని భారత జట్టు వరుసగా రెండు మేజర్ టోర్నమెంట్‌లలో ఓటమి చవిచూసింది.

ఆసియాకప్‌లోనూ విఫలమైన రోహిత్‌ సేన.. టీ20 ప్రపంచకప్‌లోనూ తమ స్థాయికి తగ్గట్టు రాణించలేకపోయింది. ఈ క్రమంలో భారత జట్టు ప్రక్షాళనకు సమయం అసన్నమైంది క్రికెట్ నిపుణులు, మాజీ క్రికెటర్‌లు అభిప్రాయపడుతున్నారు.

మరికొంత మంది రోహిత్‌ శర్మను టీ20 కెప్టెన్సీ నుంచి తప్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇక తాజాగా ఇదే విషయంపై భారత మాజీ పేసర్‌ అతుల్ వాసన్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. కెప్టెన్‌గా రోహిత్‌ సమయం ముగిసిందని హార్దిక్ పాండ్యా లేదా రిషబ్ పంత్‌లకు బాధ్యతలు అప్పజెప్పాలని అతడు సూచించాడు.

"టీ20 ఫార్మాట్‌లో భారత కెప్టెన్‌గా రోహిత్ సమయం ముగిసిందని భావిస్తున్నాను. అయితే రెండు ప్రపంచకప్‌లను దృష్టిలో పెట్టుకుని రోహిత్‌ను కెప్టెన్‌గా చేశారు. కానీ అతడిని కెప్టెన్‌గా కొనసాగించడం ద్వారా భారత్‌ క్రికెట్‌కు ఎటువంటి లాభం లేదు. మీ ముందు హార్దిక్‌ పాండ్యా, రిషబ్‌ పంత్‌ రూపంలో రెండు ఆప్షన్స్‌ ఉన్నాయి.

ఆ ఇద్దరిలో ఒకరికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పండి. ఇక ఆడిలైడ్‌లో ఏమి జరిగిందో నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. భారత్‌ ఓటమిని జీర్ణించుకోలేపోతునున్నాను. ఇంగ్లండ్‌  షార్జాలో బ్యాటింగ్‌ చేసినట్లు నాకు అనిపించింది. ఈ మ్యాచ్‌లో  రోహిత్ ఎటువంటి వ్యూహలు రచించలేదు.  చాలా నిర్ణయాలు టీమ్ మేనేజ్‌మెంట్ తీసుకున్నవే. రోహిత్‌ కేవలం ప్రేక్షక పాత్ర మాత్రమే పోషించాడు. రోహిత్‌ మునపటి కెప్టెన్‌లా ఇప్పుడు లేడు" అని  అతుల్ వాసన్ పేర్కొన్నాడు.
చదవండి: Shaheen Afridi: నీకసలు సిగ్గుందా? నా ఎదురుగా నువ్వు ఉంటేనా: వసీం అక్రమ్‌

మరిన్ని వార్తలు