IND vs AUS: ఆస్ట్రేలియాతో మూడో టెస్టు.. టీమిండియా వైస్‌ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!

20 Feb, 2023 21:03 IST|Sakshi

ఆస్ట్రేలియాతో మిగిలిన రెండు టెస్టులకు టీమిండియా వైస్‌ కెప్టెన్సీ బాధ్యతలు నుంచి కేఎల్‌ రాహుల్‌ను బీసీసీఐ తొలిగించిన సంగతి తెలిసిందే. అయితే రాహుల్‌ స్థానాన్ని ఎవరూ భర్తీ చేస్తారన్నది బీసీసీఐ ఇప్పటివరకు ప్రకటించలేదు. అయితే మూడో టెస్టుకు దాదాపు 10 రోజులు సమయం ఉంది కాబట్టి.. దగ్గరలో ప్రకటించే అవకాశం ఉంది.

కాగా తదుపరి రెండు టెస్టులకు వైస్ కెప్టెన్ ఎవరో నిర్ణయించే అధికారాన్ని కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు సెలక్షన్ కమిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రోహిత్‌ శర్మ తన డిప్యూటీగా టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా వైపు మెగ్గుచూపుతున్నట్లు సమాచారం.

"ఆస్ట్రేలియాతో మిగిలిన రెండు టెస్టులకు రోహిత్‌ డిప్యూటీ ఎవరన్నది శివ సుందర్ దాస్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ వెల్లడించలేదు. అయితే తదుపరి మ్యాచ్‌లకు వైస్‌కెప్టెన్‌ను ఎంపిక చేసే అధికారం మాత్రం రోహిత్‌ శర్మకు సెలక్టర్లు ఇచ్చారు.

ఒక వేళ తను మైదానాన్ని వీడాల్సి వస్తే జట్టును ఎవరు నడిపిస్తారు అనేది రోహిత్ శర్మ నిర్ణయం. రోహిత్‌ డిప్యూటీగా జడేజా వ్యవహరించే అవకాశం ఉంది" అని బీసీసీఐ అధికారి ఒకరు ఇన్‌సైడ్‌తో పేర్కొన్నారు. ఇక ఇరు జట్ల మధ్య మూడో టెస్టు ఇండోర్‌ వేదికగా మార్చి 1 నుంచి ప్రారంభం కానుంది.
చదవండి: IND vs AUS: వైస్‌ కెప్టెన్‌ మాత్రమే కాదు.. కేఎల్‌ రాహుల్‌కు మరో బిగ్‌ షాక్‌!

మరిన్ని వార్తలు