భారత్తో టెస్టు సిరీస్ కోసం జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా
మెల్బోర్న్: ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్లో అదరగొడుతున్న 22 ఏళ్ల విల్ పకోవ్స్కీకి జాతీయ జట్టు పిలుపు లభించింది. భారత్తో జరిగే నాలుగు టెస్టుల బోర్డర్–గావస్కర్ ట్రోఫీ కోసం సెలక్టర్లు పకోవ్స్కీని ఎంపిక చేశారు. వార్నర్తో పాటు అతను ఓపెనర్గా ఆడే అవకాశం ఉంది. విక్టోరియాకు చెందిన పకోవ్స్కీ షెఫీల్డ్ షీల్ట్ టోర్నీలో గత రెండు మ్యాచ్లలో వరుసగా రెండు డబుల్ సెంచరీలు నమోదు చేయడం విశేషం. ఓవరాల్గా 22 ఫస్ట్క్లాస్ మ్యాచ్లలో 55.48 సగటుతో అతను 1720 పరుగులు సాధించాడు. 17 మంది సభ్యుల బృందంలో పకోవ్స్కీతో పాటు చోటు లభించిన మరో నలుగురు ఆటగాళ్లు కూడా ఇప్పటి వరకు ఆస్ట్రేలియా తరఫున టెస్టులు ఆడలేదు. కామెరాన్ గ్రీన్, మిషెల్ స్వెప్సన్, మైకేల్ నెసెర్, సీన్ అబాట్లు జట్టులోకి ఎంపికయ్యారు. ఇరు జట్ల మధ్య డిసెంబర్ 17నుంచి అడిలైడ్లో తొలి టెస్టు జరుగుతుంది.
జట్టు వివరాలు: టిమ్ పైన్ (కెప్టెన్), సీన్ అబాట్, జో బర్న్స్, ప్యాట్ కమిన్స్, కామెరాన్ గ్రీన్, హాజల్వుడ్, ట్రవిస్ హెడ్, లబ్షేన్, లయన్, నెసెర్, ప్యాటిన్సన్, పకోవ్స్కీ, స్టీవ్ స్మిత్, స్టార్క్, స్వెప్సన్, వేడ్, వార్నర్