ఆసీస్‌కు ‘చాంపియన్‌షిప్‌’పాయింట్లు కోత

29 Dec, 2020 16:20 IST|Sakshi

టిమ్‌ పైన్‌ గ్యాంగ్‌కు భారీ జరిమానా

మెల్‌బోర్న్‌: టీమిండియాతో జరిగిన రెండో టెస్టులో ఓటమి పాలైన ఆసీస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఒకవైపు బాక్సింగ్‌ డే టెస్టులో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న ఆసీస్‌కు వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ పాయింట్లలో కోత పడింది. అదే సమయంలో ఆసీస్‌ జట్టుకు 40 శాతం జరిమానా విధించారు. దీనికి కారణం ఆ జట్టు స్లో ఓవర్‌ రేట్‌.  నిర్ణీత సమయానికి రెండు ఓవర్లు తక్కువగా వేయడంతో ఆసీస్‌కు చాంపియన్‌షిప్‌ పాయింట్లలో కోతతో పాటు భారీ జరిమానా విధించారు. ఆసీస్‌ స్లో ఓవర్‌రేట్‌ నమోదు చేసిన విషయాన్ని మ్యాచ్‌ రిఫరీ డేవిడ్‌ బూన్‌ ధృవీకరించారు. దీన్ని ఆసీస్‌ కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ అంగీకరించడంతో ఎటువంటి విచారణ లేకుండానే ఆ జట్టుకు పాయింట్లలో కోతతో పాటు జరిమానా విధించారు. (పదేళ్ల తర్వాత టీమిండియా.. రెండో కెప్టెన్‌గా రహానే)

ఇక్కడ రెండు ఓవర్లు ఆలస్యంగా పడటంతో ఆసీస్‌కు నాలుగు టెస్టు చాంపియన్‌షిప్‌ పాయింట్లతో పాటు 40 శాతం జరిమానా పడింది. ఐసీసీ నిబంధనల్లో భాగంగా టెస్టు చాంపియన్‌షిప్‌లో ఓవర్లు తక్కువగా పడితే ప్రతీ ఓ‍వర్‌ను పరిగణలోకి తీసుకుంటారు. ఆర్టికల్‌ 16.11.2 నిబంధన ప్రకారం ఓవర్‌ ఆలస్యానికి రెండు టెస్టు చాంపియన్‌షిప్‌ పాయింట్లతో పాటు 20 శాతం ఫీజు కోత పడుతుంది. ఇక్కడ ఆసీస్‌ రెండు ఓవర్లు ఆలస్యం చేయడంతో నాలుగు పాయింట్లు, 40 శాతం మ్యాచ్‌ ఫీజును కోల్పోనుంది. కాగా, ఈ మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆసీస్‌ నిర్దేశించిన 70 పరుగుల స్వల్ప టార్గెట్‌ను 15.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దాంతో బాక్సింగ్‌ డే టెస్టు మ్యాచ్‌ నాలుగు రోజుల్లోనే ముగిసింది.  రెండో టెస్టులో టీమిండియా సమష్టిగా రాణించడంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.  (రహానే ఖాతాలో స్పెషల్‌ మెడల్‌.. దాని ప్రత్యేకత ఏమిటి?)

>
మరిన్ని వార్తలు