మూడో  టీ20లో భారత్‌ ఓటమి.. సిరీస్‌ ఆస్ట్రేలియాదే

10 Oct, 2021 18:14 IST|Sakshi

Australia seal the T20I series Against India: గోల్డ్‌కోస్ట్‌ వేదికగా  జరిగిన మూడో  టీ20లో భారత మహిళల జట్టుపై 14 పరుగుల తేడాతో  ఆస్ట్రేలియా విజయం సాధించింది. దీంతో 2-0తో ఆస్ట్రేలియా సీరీస్‌ను కైవసం చేసుకుంది. 149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ ఆదిలోనే  షఫాలీ వర్మ వికెట్‌ కోల్పోయినప్పటకీ  స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్‌ కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఈ క్రమంలో స్మృతి మంధాన ఆర్ధసెంచరీనీ పూర్తి చేసుకుంది. మంధాన 49 బంతుల్లో 8 ఫోర్లుతో 52 పరుగులు సాధించింది. మంధాన ఔటయ్యక  సారథి హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, పూజా వస్త్రకర్‌, హార్లీన్ డియోల్ ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్‌కు క్యూ కట్టారు.

రిచా ఘోష్ (11 బంతుల్లో 22 నాటౌట్‌ 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) చివరలో దూకుడుగా ఆడినా భారత్‌ను విజయతీరాలకు చేర్చలేకపోయింది. భారత్‌ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 135 పరుగులకే పరిమితమైంది. ఆస్ట్రేలియా బౌలర్లలో నికోలా క్యారీ రెండు వికెట్లు పడగొట్టగా, సదర్లాండ్, యాష్లే గార్డనర్, జార్జియా వారహమ్ చెరో వికెట్‌ సాధించారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌  20 ఓవర్లలో 5వికెట్లకు 149 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాటర్స్‌లో  మెక్‌గ్రాత్‌(61), బెత్‌ మూనీ(44) పరుగలుతో రాణించారు. భారత బౌలర్లలో రాజేశ్వరీ గైక్వాడ్ రెండు వికెట్లు పడగొట్టగా, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్,రేణుకా సింగ్ చెరో వికెట్‌ సాధించారు.

మరిన్ని వార్తలు