‘మాస్టర్‌... అతని విద్యార్థి’

18 Nov, 2020 14:36 IST|Sakshi

భారత క్రికెటర్ల టెస్టు మ్యాచ్‌ ప్రాక్టీస్‌

సిడ్నీ: ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు సరిగ్గా నెల రోజుల సమయముంది. దానికి ముందు టీమిండియా వన్డే, టి20 సిరీస్‌లు ఆడాల్సి ఉంది. అయితే టెస్టులకు ఉన్న ప్రాధాన్యత వల్ల కావచ్చు అప్పుడే వాటి కోసం మన ఆటగాళ్లు సన్నద్ధమవుతున్నారు. పైగా ఐపీఎల్‌ కారణంగా ఇప్పటి వరకు మన ఆటగాళ్లంతా తెల్ల బంతితో సాధన చేస్తూనే వచ్చారు. భారత జట్టు ప్రాక్టీస్‌కు సంబంధించి బీసీసీఐ మంగళవారం ఒక వీడియోను పోస్ట్‌ చేసింది.

జట్టు టాప్‌ పేస్‌ బౌలర్‌ మొహమ్మద్‌ షమీతో పాటు మరో పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ ఎరుపు, గులాబీ బంతులతో బౌలింగ్‌ చేయడం ఇందులో కనిపించింది. వీరిద్దరు కెప్టెన్‌ కోహ్లి, కేఎల్‌ రాహుల్‌ సహా ఇతర బ్యాట్స్‌మెన్‌కు సుదీర్ఘ సమయం పాటు బౌలింగ్‌ చేశారు. ‘మాస్టర్‌... అతని విద్యార్థి’ అంటూ షమీ, సిరాజ్‌ల బౌలింగ్‌పై బీసీసీఐ వ్యాఖ్య జోడించింది. కోహ్లి కూడా ‘టెస్టు క్రికెట్‌ ప్రాక్టీస్‌ సెషన్లను ఇష్టపడతాను’ అంటూ కామెంట్‌ చేయడం టీమిండియా సన్నాహాల గురించి చెబుతోంది. ఈ టూర్‌లో భాగంగా భారత్‌ ఈ నెల 27న ఆస్ట్రేలియాతో తొలివన్డే ఆడుతుంది.
(చదవండి: మారిపోనున్న టీమిండియా ఆటగాళ్ల జెర్సీలు)

మరిన్ని వార్తలు