ఆసీస్‌దే టి20 సిరీస్‌ 

28 Sep, 2020 03:17 IST|Sakshi

రెండో మ్యాడ్‌లోనూ కివీస్‌ ఓటమి ∙

కీపర్‌ అలీసా హీలీ రికార్డు

బ్రిస్బేన్‌: పొదుపైన బౌలింగ్, అద్భుత బ్యాటింగ్, రికార్డు వికెట్‌ కీపింగ్‌ నైపుణ్యాలతో ఆస్ట్రేలియా మహిళల జట్టు మ్యాచ్‌తో పాటు సిరీస్‌ విజయాన్ని సాధించింది. న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే ఆస్ట్రేలియా 2–0తో సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో ఆసీస్‌ 8 వికెట్ల తేడాతో నెగ్గింది. టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ 19.2 ఓవర్లలో 128 పరుగులకు ఆలౌటైంది. ఆమీ శాటర్‌వైట్‌ (30; 5 ఫోర్లు) రాణించింది. ఈ మ్యాచ్‌లో శాటర్‌వైట్‌ను స్టంపౌట్‌ చేయడం ద్వారా ఆసీస్‌ వికెట్‌ కీపర్‌ అలీసా హీలీ... టి20 ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లలో పాలుపంచుకున్న వికెట్‌ కీపర్ల జాబితాలో భారత మాజీ కెప్టెన్, వికెట్‌ కీపర్‌ ధోని (97 ఇన్నింగ్స్‌లో 91)తో సమానంగా నిలిచింది. అనంతరం లారెన్‌ డౌన్‌ (12) క్యాచ్‌ తీసుకొని ధోనిని అధిగమించింది. 129 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్‌ 16.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అలీసా హీలీ (17 బంతుల్లో 33; 5 ఫోర్లు, 1 సిక్స్‌), రాచెల్‌ (40; 5 ఫోర్లు) సత్తా చాటారు.  

మరిన్ని వార్తలు