మెగ్‌ లానింగ్‌ మళ్లీ నంబర్‌వన్‌

9 Oct, 2020 06:22 IST|Sakshi

నాలుగు స్థానాలు ఎగబాకిన ఆసీస్‌ కెప్టెన్‌

మార్పుల్లేని స్మృతి, మిథాలీ ర్యాంక్‌లు

ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్‌  

దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) తాజాగా ప్రకటించిన మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. నాలుగు స్థానాలు ఎగబాకిన మెగ్‌ లానింగ్‌ 749 రేటింగ్‌ పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. న్యూజిలాండ్‌తో బుధవారం ముగిసిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో రాణించిన లానింగ్‌... సెంచరీతో సహా మొత్తం 163 పరుగులు చేసి సిరీస్‌ను ఆసీస్‌ కైవసం చేసుకోవడంలో ముఖ్యపాత్ర పోషించింది.

నంబర్‌వన్‌ ర్యాంక్‌ను చేజిక్కించుకోవడం లానింగ్‌కు ఇది ఐదోసారి. అంతేకాకుండా ఆమె టాప్‌ ర్యాంకులో 902 రోజులను పూర్తి చేసుకోవడం విశేషం. లానింగ్‌ తొలిసారి 2014లో టాప్‌ ర్యాంక్‌కు చేరుకుంది. వెస్టిండీస్‌ ప్లేయర్‌ స్టెఫానీ టేలర్, అలీసా హీలీ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. భారత స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన (732 రేటింగ్‌ పాయింట్లు) నాలుగో స్థానంలో... సారథి మిథాలీ రాజ్‌ పదో స్థానంలో నిలిచారు. బౌలింగ్‌ విభాగంలో ఆసీస్‌ స్పిన్నర్‌ జెస్సికా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. భారత బౌలర్లలో జులన్‌ గోస్వామి, పూనమ్‌ యాదవ్, శిఖా పాండే, దీప్తి శర్మలు వరుసగా ఐదు, ఆరు, ఏడు, పది స్థానాల్లో ఉన్నారు. టీమ్‌ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా తొలి స్థానంలో కొనసాగుతుంది. భారత్‌ రెండో స్థానంలో ఉంది.

>
మరిన్ని వార్తలు