యూఎస్‌ ఓపెన్‌ నుంచి వైదొలగిన బార్టీ

31 Jul, 2020 01:44 IST|Sakshi

బ్రిస్బేన్‌: యూఎస్‌ ఓపెన్‌ టెన్నిస్‌ గ్రాండ్‌స్లామ్‌ నిర్వాహకులకు షాక్‌... ఈ ఏడాది జరగాల్సిన ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌ నుంచి మహిళల ప్రపంచ నంబర్‌ వన్, ఆస్ట్రేలియా టెన్నిస్‌ ప్లేయర్‌ యాష్లే బార్టీ వైదొలిగింది. గురువారం ఆమె స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించింది. యూఎస్‌ ఓపెన్‌ ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్‌ 13 మధ్య జరగనుంది. అయితే కరోనా విజృంభణ ఇంకా కొనసాగుతున్న తరుణంలో తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు బార్టీ తెలిపింది.

ఈ మెగా ఈవెంట్‌తో పాటు కరోనా విరామం అనంతరం జరుగుతున్న తొలి టెన్నిస్‌ టోర్నమెంట్‌ అయిన సిన్సినాటి మాస్టర్స్‌ నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ఆమె ప్రకటించింది. సెప్టెంబర్‌కు వాయిదా పడిన ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఆడేది లేనిది త్వరలో వెల్లడిస్తానని... 24 ఏళ్ల బార్టీ పేర్కొంది. ఆగస్టు 20 నుంచి మొదలయ్యే సిన్సినాటి టోర్నీలో పాల్గొనే ఆటగాళ్ల ప్రాథమిక జాబితాను టోర్నీ నిర్వాహకులు గత బుధవారం ప్రకటించారు. ఇందులో  జొకోవిచ్, రాఫెల్, మెద్వెదేవ్, థీమ్‌ ఉండగా... సెరెనా , కోకో గౌఫ్‌ పేర్లు ఉన్నాయి.  

>
మరిన్ని వార్తలు