IND vs WI: ధోని 17 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన అక్షర్‌ పటేల్‌.. తొలి భారత ఆటగాడిగా!

25 Jul, 2022 13:33 IST|Sakshi
అక్షర్‌ పటేల్‌(PC: BCCI)

వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో భారత ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టాడు. బౌలింగ్‌లో ఒక్క వికెట్‌ తీయడానికే పరిమితమైనా.. బ్యాటింగ్‌లో దుమ్మురేపాడు. కేవలం 35 బంతుల్లో 64 పరుగులతో అజేయంగా నిలిచిన అక్షర్‌ పటేల్‌.. భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 3 పోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్‌లో ఈ తరహా అద్భుత ఇన్నింగ్స్‌తో అక్షర్‌ ​పటేల్‌ 17 ఏళ్ల నాటి ధోని రికార్డును బద్దలు కొట్టాడు.

వన్డేల్లో లక్ష్య ఛేదనలో విజయవంతమైన జట్టు తరఫున 7 లేదా అంతకంటే ముందు స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాడిగా అక్షర్‌  రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 5 సిక్సర్‌లు బాదిన అక్షర్‌ ఈ ఘనత సాధించాడు. కాగా 2005లో జింబాబ్వేపై  మూడు సిక్సర్లు బాదిన భారత మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని ఈ అరుదైన రికార్డు తొలుత తన పేరిట లిఖించుకున్నాడు.

అదే విధంగా భారత మాజీ ఆల్‌ రౌండర్‌ యూసఫ్‌ పఠాన్‌ కూడా 2011లో మూడు సిక్సర్లు బాది ధోని రికార్డును సమం చేశాడు. ఇక తాజా మ్యాచ్‌లో వీరిద్దరి రికార్డులను అక్షర్‌ పటేల్ బ్రేక్‌ చేశాడు. ఇదిలా ఉంటే.. రెండో వన్డేలో భారత్‌ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2-0 తో భారత్‌ కైవసం చేసుకుంది.

ఇండియా వర్సెస్‌ వెస్టిండీస్‌ రెండో వన్డే
►వేదిక: క్వీన్స్ పార్క్ ఓవల్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్, ట్రినిడాడ్‌
►టాస్‌: వెస్టిండీస్‌- బ్యాటింగ్‌
►వెస్టిండీస్‌ స్కోరు: 311/6 (50 ఓవర్లు)
►సెంచరీతో చెలరేగిన విండీస్‌ బ్యాటర్‌ షాయి హోప్‌(115 పరుగులు)
►భారత్‌ స్కోరు: 312/8 (49.4 ఓవర్లు)
►విజేత: భారత్‌.. 2 వికెట్ల తేడాతో గెలుపు
►ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: అక్షర్‌ పటేల్‌ ‌(64 పరుగులు, ఒక్క వికెట్‌)
►శ్రేయస్‌ అయ్యర్‌(63), అక్షర్‌ పటేల్(64‌), సంజూ శాంసన్‌(54) అర్ధ శతకాలు
చదవండిAxar Patel: సిక్సర్‌తో ముగించి.. ఈ మ్యాచ్‌ ప్రత్యేకం.. ఐపీఎల్‌లో కూడా!

మరిన్ని వార్తలు