రెండో టెస్ట్‌కు భారత జట్టులో కీలక మార్పు!

11 Feb, 2021 17:06 IST|Sakshi

చెన్నై: ఇంగ్లండ్‌‌తో ఈనెల 13 నుంచి ప్రారంభం కాబోయే రెండో టెస్ట్‌ కోసం భారత తుది జట్టులో కీలక మార్పు చేయాలని జట్టు మేనేజ్‌మెంట్‌ యోచిస్తోంది. తొలి టెస్టులో ఘోరంగా విఫలమైన లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ షాబాజ్‌ నదీమ్‌ స్థానంలో ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ ఎంపిక దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. తొలి టెస్ట్‌లో నదీమ్‌ నాలుగు వికెట్లు పడగొట్టినప్పటికీ.. దాదాపు నాలుగు రన్‌రేట్‌తో పరుగులు ధారాళంగా సమర్పించుకున్నాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో 59 ఓవర్లు వేసి 233 పరగులు ఇచ్చాడు. ఇది చాలదన్నట్లు మ్యాచ్‌లో ఏకంగా 9 నోబాల్స్‌ కూడా వేశాడు. ఈ పేలవ ప్రదర్శన కారణంగా అతనిపై వేటు దాదాపు ఖరారైంది. 

కాగా, మోకాలి  గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమైన అక్షర్‌ పటేల్‌.. రెండో టెస్టులో జట్టులోకి వచ్చేది దాదాపుగా ఖరారైనట్టే. అతను నెట్స్‌లో బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌ కూడా సాధన చేస్తున్నాడు. ఫస్ట్‌ క్లాస్‌ కెరీర్‌లో 39 మ్యాచ్‌లు ఆడిన 27 ఏళ్ల అక్షర్‌ పటేల్‌‌.. భారత్‌ తరపున పరిమిత ఓవర్ల క్రికెట్ మాత్రమే ఆడాడు‌. అతను టెస్ట్‌ క్రికెట్‌ అరంగేట్రం చేయాల్సివుంది. కాగా, ఇంగ్లండ్‌తో చెపాక్‌ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. 227 పరుగుల తేడాతో పర్యాటక జట్టు చేతిలో ఓటమి చవి చూసింది. నాలుగు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో భారత్‌ 0-1 తేడాతో వెనకపడివుంది.
 

మరిన్ని వార్తలు