కోహ్లి వన్డే టాప్‌ ర్యాంక్‌కు బాబర్‌ అజమ్‌ ఎసరు 

8 Apr, 2021 21:24 IST|Sakshi

దుబాయ్‌: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి టాప్‌ ర్యాంక్‌కు పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌ ఎసరు పెట్టేలా ఉన్నాడు. ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్‌లో 857 రేటింగ్‌ పాయింట్లు కలిగిన టీమిండియా కెప్టెన్‌.. రెండో స్థానంలో ఉన్న పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌(852) కంటే కేవలం ఐదు పాయింట్లు ఎక్కువ కలిగి ఉన్నాడు. ఇటీవల ఇంగ్లాండ్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో రెండు అర్ద శతకాలతో రాణించిన కోహ్లి.. అగ్రస్థానాన్ని కాపాడుకోగలిగాడు. అయితే కోహ్లి టాప్ ర్యాంకుకు ఇప్పుడు ముప్పొచ్చేలా కనిపిస్తుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో పాక్‌ కెప్టెన్ బాబర్ అజమ్ అద్భుతంగా రాణించడంతో అతను రేటింగ్‌ పాయింట్లను భారీగా పెంచుకొని వచ్చే వారం ప్రకటించబోయే ఐసీసీ ర్యాంకుల్లో కోహ్లిను  దాటి అగ్రస్థానాన్ని కైవసం చేసుకోనున్నాడు.

తొలి వన్డేలో 103, రెండో వన్డేలో 31, మూడో వన్డేలో 94 పరుగులతో రాణించిన అజమ్‌.. ఆ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలో అతను మొదటి, మూడు వన్డేల్లో మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డును కూడా గెలుచుకున్నాడు. ఈ సిరీస్‌లో అజమ్‌కు తోడుగా ఫకర్‌ జమాన్‌(193, 103) కూడా రాణించడంతో పాక్‌ జట్టు దక్షిణాఫ్రికాను వారి సొంతగడ్డపై 2-1తేడాతో మట్టికరిపించింది. కాగా, సమకాలీన క్రికెట్‌లో కోహ్లికు పోటీగా బాబర్ ఆజమ్ ఉంటాడని పలువురు విశ్లేషకులు చెబుతుంటారు.

మరిన్ని వార్తలు