Babar Azam-Virat Kohli: 61 పరుగులు చేస్తేనే.. బాబర్‌ ఆజంకు అంత సీన్‌ లేదు!

28 Sep, 2022 18:58 IST|Sakshi

పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజంకు టీమిండియా రన్‌మెషిన్‌ విరాట్‌ కోహ్లి రికార్డు బద్దలు కొట్టే చాన్స్‌ వచ్చింది. ఇంగ్లండ్‌తో ఇవాళ జరగనున్న నాలుగో టి20లో బాబర్‌ ఆజం మరో 61 పరుగులు చేస్తే టి20 క్రికెట్‌లో 3వేల పరుగుల మైలురాయిని అందుకోనున్నాడు. బాబర్‌ ఇప్పటివరకు 79 ఇన్నింగ్స్‌ల్లో 2939 పరుగులు చేశాడు. మరొక 61 పరుగులు చేస్తే 80 ఇన్నింగ్స్‌ల్లో 3వేల మార్క్‌ను అందుకుంటాడు.

ఇక కోహ్లి టి20 క్రికెట్‌లో 3వేల పరుగుల మార్క్‌ను అందుకోవడానికి 81 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. ఒకవేళ ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో బాబర్‌ 61 పరుగులు చేస్తే గనుక ఒక్క ఇన్నింగ్స్‌ తక్కువ తేడాతో కోహ్లిని అధిగమించే అవకాశం ఉంది. ఇటీవలే అతని బ్యాటింగ్‌ అంతగా ఆకట్టుకోలేకపోయినప్పటికి.. తాజాగా ఇంగ్లండ్‌తో సిరీస్‌లో రెండో టి20లో ఏకంగా సెంచరీ బాది జట్టును గెలిపించి తిరిగి ఫామ్‌లోకి వచ్చినట్టే కనిపిస్తున్నాడు. 

అయితే టీమిండియా అభిమానులు మాత్రం బాబర్‌ ఆజంను ట్రోల్‌ చేశారు. 61 పరుగులు చేస్తే కదా.. కోహ్లిని అధిగమిస్తాడు.. బాబర్‌ ఆజంకు అంత సీన్‌ లేదు. ఈ మ్యాచ్‌లో తక్కువ స్కోరుకే వెనుదిరుగుతాడు.. అంతగా కావాలంటే కోహ్లితో సమానంగా నిలవాలి లేదంటే అతని కంటే ఒక ఇన్నింగ్స్‌ ఎక్కువ ఆడి 3వేల పరుగుల మార్క్‌ను అందుకోవాలి అంటూ కామెంట్‌ చేశారు.

ఈ సంగతి పక్కనబెడితే విరాట్ కోహ్లి, బాబ‌ర్ ఆజంలు.. ఇద్దరూ ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ప్రతిభ క‌లిగిన‌ బ్యాట‌ర్‌లు. పైగా ఇద్దరూ క్రికెట్‌ను ఎంతగానో అభిమానించే భార‌త్‌, పాకిస్థాన్ దేశాల‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. బాబర్‌ కంటే చాలా ముందే అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన కోహ్లి రికార్డుల మీద రికార్డులు న‌మోదు చేశాడు. ఆ త‌ర్వాత క్రికెట్‌లోకి వ‌చ్చిన బాబ‌ర్ అజామ్ కోహ్లి రికార్డులకు చెక్‌ పెట్టుకుంటూ వస్తున్నాడు. కానీ సెంచరీల విషయంలో మాత్రం కోహ్లి రికార్డును బాబర్‌ ఆజం సహా ఎవరు బ్రేక్‌ చేయలేకపోతున్నారు.

చదవండి: కోహ్లికి పోటీగా రోహిత్‌ కటౌట్‌.. తగ్గేదేలే అంటున్న అభిమానులు

మరిన్ని వార్తలు