అంతర్జాతీయ క్రీడా పోటీల్లో గిరిజన యువకుల సత్తా

15 Jun, 2022 13:18 IST|Sakshi
పతకాలు సాధించిన పాంగి గౌతమ్, సూర్య.. రెండు పతకాలతో ప్రభూషణ్‌రావు

అనంతగిరి/ జి.మాడుగుల/ చింతూరు: (అల్లూరి సీతారామరాజు జిల్లా): జిల్లాలోని అనంతగిరి, జి.మాడుగుల, చింతూరు మండలాలకు చెందిన గిరిజన యువకులు నేపాల్‌లోని ఖాట్మండులో జరిగిన యూత్‌గేమ్స్‌ ఇండో, నేపాల్‌ ఇంటర్నేషనల్‌ సిరీస్‌–2022 పోటీల్లో సత్తా చాటారు. ఈనెల 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఈ పోటీలు జరిగాయి. జి.మాడుగుల మండలం కుంబిడిసింగి పంచాయతీ వెన్నెల గ్రామానికి చెందిన ప్రభూషణరావు అండర్‌–19 విభాగంలో సింగిల్స్, డబుల్స్‌లో బంగారు పతకాలు సాధించాడు. 

అలాగే చింతూరుకు చెందిన కారం చక్రియవర్ధన్‌ రెండు గోల్డ్‌మెడల్స్‌ సాధించాడు. బ్యాడ్మింటన్‌ అండర్‌–17 విభాగం సింగిల్స్‌లో చక్రియవర్ధన్‌ గోల్డ్‌మెడల్‌ సాధించగా, రంపచోడవరానికి చెందిన లతిక్‌తో కలసి డబుల్స్‌ విభాగంలోనూ గోల్డ్‌మెడల్‌ సాధించాడు. అలాగే అనంతగిరి మండలం ఎగువశోభ పంచాయతీకి చెందిన పాంగి గౌతమ్‌ షటిల్‌ బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో బంగారు పతకం సాధించాడు. అనంతగిరి పంచాయతీ పెద్దూరు గ్రామానికి చెందిన కమిడి సూర్య, గౌతమ్‌ కలిసి డబుల్స్‌లో రజత పతకాన్ని సాధించారు. (క్లిక్‌: అంతర్జాతీయ క్రీడా పోటీల్లో మన్యం యువకుల సత్తా)

మరిన్ని వార్తలు