‘ఇప్పుడు ఈ టోర్నీలు అవసరమా’

14 Sep, 2020 02:49 IST|Sakshi

థామస్, ఉబెర్‌ కప్‌పై సైనా సూటి ప్రశ్న

న్యూఢిల్లీ: కరోనా తీవ్రత ఇంకా తగ్గని ప్రస్తుత స్థితిలో ప్రతిష్టాత్మక ‘థామస్, ఉబెర్‌ కప్‌ ఫైనల్స్‌’ టోర్నీ నిర్వహణపై భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ ఆందోళన వ్యక్తం చేసింది. వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోన్న ఈ సమయంలో టోర్నీ నిర్వహణ సురక్షితమేనా అని ఆమె ప్రశ్నించింది. ‘మహమ్మారికి భయపడి ఏడు దేశాలు టోర్నీ నుంచి నిష్క్రమించాయి. ఈ సమయంలో టోర్నీ నిర్వహించడం సబబేనా?’ అని సైనా ట్వీట్‌ చేసింది. డెన్మార్క్‌లో అక్టోబర్‌ 3నుంచి 11వరకు థామస్, ఉబెర్‌ కప్‌ జరుగనుంది. మార్చిలో ఆగిపోయిన అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ పోటీలు మళ్లీ ఈ టోర్నీతోనే ప్రారంభం కానున్నాయి. అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తోన్న ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) ఆటగాళ్లకు క్వారంటీన్‌ వెసులుబాటు కూడా కల్పించింది. టోర్నీ కోసం డెన్మార్క్‌ చేరుకునే ఆటగాళ్లు ‘నెగెటివ్‌’గా తేలితే తప్పనిసరిగా క్వారంటీన్‌లో ఉండాల్సిన అవసరం లేదని బీడబ్ల్యూఎఫ్‌ ప్రకటించింది. ఇప్పటికే ఈ టోర్నీలో పాల్గొనే భారత పురుషుల, మహిళల జట్లను ‘బాయ్‌’ ప్రకటించింది.

మరిన్ని వార్తలు