Saina Nehwal: ముగిసిన సైనా నెహ్వాల్‌ పోరాటం.. ఓటమితో నిష్క్రమణ

25 Aug, 2022 15:13 IST|Sakshi
సైనా నెహ్వాల్‌(PC: BAI Media Twitter)

Badminton World Championshipsబీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌-2022లో భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ ప్రయాణం ముగిసింది. టోక్యో వేదికగా గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఈ మాజీ చాంపియన్‌ ఓటమి పాలైంది. థాయ్‌లాండ్‌కు చెందిన షట్లర్‌ బుసానన్‌ ఒంగ్బామ్రంగ్‌ఫాన్‌ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.

గంటా నాలుగు నిమిషాల పాటు సాగిన సుదీర్ఘ మ్యాచ్‌లో బుసానన్‌ ఆది నుంచే ఆధిపత్యం కనబరిచింది. దీంతో మొదటి గేమ్‌ను సైనా 17-21తో కోల్పోయింది. అయితే, రెండో గేమ్‌లో పుంజుకున్న ఈ లండన్‌ ఒలింపిక్స్‌ కాంస్య విజేత 21-16తో ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బ కొట్టింది.

ఈ క్రమంలో మూడో గేమ్‌లో తిరిగి ఆధిక్యంలోకి వచ్చిన బుసానన్‌ 21-13తో సైనాను ఓడించింది. తద్వారా క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. మరోవైపు.. సైనా ఇంటిబాట పట్టింది. ఇక అంతకుముందు మ్యాచ్‌లో సైనా.. హాంకాంగ్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ చెయుంగ్ న్గన్ యిను 21-19, 21-9తో ఓడించి ప్రిక్వార్టర్స్‌ వరకు చేరుకుంది.

ఇదిలా ఉంటే..  పురుషుల డబుల్స్‌లో అన్‌సీడెడ్‌ భారత ప్లేయర్లు ధ్రువ్‌ కపిల- ఎం.ఆర్‌ అర్జున్‌ తొలిసారిగా క్వార్టర్స్‌కు చేరుకున్నారు. అదే విధంగా చిరాగ్‌ శెట్టి, సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి క్వార్టర్‌ ఫైనల్లో అడుగుపెట్టారు.

చదవండి: Asia Cup- Highest Run Scorers: టోర్నీ చరిత్రలో అతడే ఇప్పటి వరకు టాపర్‌! కానీ కోహ్లి మాత్రం..
NZ vs AUS: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌.. జట్టును ప్రకటించిన కివీస్‌! స్టార్‌ బౌలర్‌ వచ్చేశాడు!

>
మరిన్ని వార్తలు