South Asia Football Championship: భారత్‌కు తొలిసారి చుక్కెదురు

14 Sep, 2022 13:38 IST|Sakshi

కఠ్మాండు (నేపాల్‌): దక్షిణాసియా ఫుట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ (శాఫ్‌) చరిత్రలో భారత మహిళల జట్టు తొలిసారి పరాజయం చవి చూసింది. మంగళవారం జరిగిన గ్రూప్‌ ‘ఎ’ మూడో లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 0–3 గోల్స్‌ తేడాతో బంగ్లాదేశ్‌ చేతిలో ఓడిపోయింది. బంగ్లాదేశ్‌ తరఫున మొసమ్మత్‌ సిరాత్‌ జహాన్‌ షోప్న (12వ, 52వ ని.లో) రెండు గోల్స్‌ చేయగా... కృష్ణరాణి సర్కార్‌ (22వ ని.లో) ఒక గోల్‌ సాధించింది.

తొలి రెండు లీగ్‌ మ్యాచ్‌ల్లో నెగ్గి ఇప్పటికే సెమీఫైనల్‌ చేరిన భారత్‌ ఈనెల 16న జరిగే సెమీఫైనల్లో నేపాల్‌తో ఆడుతుంది. మరో సెమీఫైనల్లో భూటాన్‌తో బంగ్లాదేశ్‌ తలపడుతుంది. 2010 నుంచి ఇప్పటివరకు ఐదుసార్లు ‘శాఫ్‌’ టోర్నీ జరగ్గా భారత్‌ ఐదుసార్లూ చాంపియన్‌గా నిలిచింది. ఐదు టోర్నీలలో కలిపి భారత్‌ మొత్తం 23 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 22 మ్యాచ్‌ల్లో గెలిచి, ఒక మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంది. ఈ ఏడాది టోర్నీలో ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచింది.   

మరిన్ని వార్తలు