BAN VS NZ: చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్‌.. కివీస్‌పై తొలిసారి..

8 Sep, 2021 20:22 IST|Sakshi

ఢాకా: న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఆతిధ్య బంగ్లాదేశ్‌ జట్టు చరిత్ర సృష్టించింది. ఢాకా వేదికగా జరిగిన నాలుగో టీ20లో పర్యాటక జట్టుపై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1 తేడాతో కైవసం చేసుకున్న బంగ్లా జట్టు.. తొట్ట తొలిసారిగా న్యూజిలాండ్‌పై టీ20 సిరీస్‌ గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన కివీస్‌.. బంగ్లా బౌలర్లు నసుమ్‌ అహ్మద్‌(4/10), ముస్తాఫిజుర్‌(4/12) ధాటికి 19.3 ఓవర్లలో 93 పరుగులకే కుప్పకూలింది. విల్‌ యంగ్‌(48 బంతుల్లో 46; 5 ఫోర్లు, సిక్స్‌), కెప్టెన్‌ లాథమ్‌(26 బంతుల్లో 21; ఫోర్‌) రెండంకెల స్కోర్‌ చేయడంతో కివీస్‌ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. 

అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో బంగ్లా సైతం ఆరంభంలో తడబడినప్పటికీ.. కెప్టెన్‌ మహ్మదుల్లా(48 బంతుల్లో 43 నాటౌట్‌; ఫోర్‌, 2 సిక్సర్లు) చివరి దాకా క్రీజ్‌లో నిలబడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతనికి ఓపెనర్‌ మహ్మద్‌ నయిమ్‌(35 బంతుల్లో 29; ఫోర్‌, సిక్స్‌) సహకారం​ అందించడంతో బంగ్లా జట్టు 19.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. కివీస్‌ బౌలర్లలో ఎజాజ్‌ పటేల్‌ 2, కోల్‌ మెక్‌ కొన్చి ఓ వికెట్‌ పడగొట్టారు. కెరీర్‌ బెస్ట్‌ గణాంకాలతో న్యూజిలాండ్‌ నడ్డి విరిచిన నసుమ్‌ అహ్మద్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. కాగా, ఈ సిరీస్‌ తొలి రెండు మ్యాచ్‌ల్లో బంగ్లా జట్టు గెలుపొందగా.. మూడో టీ20ని న్యూజిలాండ్‌ నెగ్గింది. ఇరు జట్ల మధ్య నామమాత్రమైన చివరి మ్యాచ్‌ శుక్రవారం(సెప్టెంబర్‌ 10) ఇదే వేదికగా జరుగనుంది.  
చదవండి: ఆ క్రికెట్‌ దిగ్గజం సలహాలు నా ఆటతీరుని మెరుగుపర్చాయి..
 

మరిన్ని వార్తలు