ఇలాంటి మ్యాచ్‌ నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్ 

31 Mar, 2021 01:09 IST|Sakshi

నేపియర్‌: న్యూజిలాండ్‌తో రెండో టి20లో ఛేదనకు బంగ్లాదేశ్‌ బరిలోకి దిగింది. కానీ ఎన్ని పరుగులు చేస్తే గెలుస్తామో తెలీదు! దానిపై స్పష్టత లేకుండానే అంపైర్లు ఆట మొదలు పెట్టేశారు. వర్షం బారిన పడిన మ్యాచ్‌లో మైదానంలోని పెద్ద స్క్రీన్‌పై, కివీస్‌ అధికారిక ట్విట్టర్‌లో 16 ఓవర్లలో 148గా చూపించారు. 9 బంతులు పడిన తర్వాత హడావిడిగా మ్యాచ్‌ రిఫరీ జెఫ్‌ క్రో కంప్యూటర్‌తో కుస్తీ పట్టి డక్‌వర్త్‌ లూయిస్‌ లెక్క ప్రకారం లక్ష్యాన్ని 16 ఓవర్లలో 170గా తేల్చాడు. ఆ వెంటనే కాదు కాదు అంటూ నాలుక్కర్చుకొని చివరకు 171 పరుగులుగా ఖరారు చేశారు! ‘డక్‌వర్త్‌’ ఎంత గందరగోళమో, చివరకు మ్యాచ్‌ రిఫరీలకు కూడా అర్థం కానిదని ఈ ఘటన నిరూపించింది.

సాధారణ వర్ష సూచన ఉన్నప్పుడు ఓవర్లు, వికెట్ల ప్రకారం చేయాల్సిన లక్ష్యాన్ని నిర్దేశిస్తూ ఇన్నింగ్స్‌ విరామం మధ్యలో ఇరు జట్లకు ఒక షీట్‌ను అందిస్తారు. సరిగ్గా లెక్క చేయలేక వాటిని ఇవ్వకపోవడంతో ఇదంతా జరిగి నిర్వహణా లోపాన్ని చూపించింది. చివరకు జెఫ్‌ క్రో ఇరు జట్లకు క్షమాపణలు చెప్పుకున్నాడు! ఈ మ్యాచ్‌లో కివీస్‌ 28 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై నెగ్గి 2–0తో సిరీస్‌ దక్కించుకుంది. ముుందుగా కివీస్‌ 17.5 ఓవర్లలో 5 వికెట్లకు 173 పరుగులు చేసింది. వర్షం రావడంతో ఇన్నింగ్స్‌ను ముగించారు. ఫిలిప్స్‌ (58 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), మిచెల్‌ (34 నాటౌట్‌ ; 6 ఫోర్లు) రాణించారు. బంగ్లాదేశ్‌ 16 ఓవర్లలో 7 వికెట్లకు 142 పరుగులు చేసి ఓడింది. 

చదవండి: (క్వారంటైన్‌ కలిపింది ఆ ఇద్దరినీ...)

(ఐపీఎల్‌ 2021: పంజాబ్‌ పదునెంత?)

మరిన్ని వార్తలు