రమేశ్‌ పొవార్‌కు బీసీసీఐ బంపర్‌ ఆఫర్‌.. రెండోసారి

13 May, 2021 18:24 IST|Sakshi

ముంబై: టీమిండియా మాజీ క్రికెటర్‌ రమేశ్‌ పొవార్‌ మరోసారి భారత మహిళల జట్టు ప్రధాన కోచ్‌గా ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ గురువారం తన ట్విటర్‌లో షేర్‌ చేసింది. టీమిండియా వుమెన్స్‌ హెడ్‌కోచ్ పదవికి మొత్తం 35 అప్లికేషన్స్‌ రాగా..  ఆర్పీ సింగ్‌, మదన్‌ లాల్‌, సులక్షణ నాయక్‌ నేతృత్వంలోని క్రికెట్‌ అడ్వైజరీ కమిటీ హెడ్‌కోచ్‌గా పొవార్‌కే ఓటు వేసింది. కమిటీ​ సిఫార్సు మేరకు బీసీసీఐ కూడా పొవార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుంది.

కాగా ప్రస్తుతం టీమిండియా మహిళల కోచ్‌గా ఉన్న డబ్ల్యూవీ రామన్‌ నుంచి పొవార్‌ బాధ్యతలు తీసుకోనున్నారు. 2018 డిసెంబర్‌లో పొవార్‌ నుంచే బాధ్యతలు తీసుకున్న రామన్‌ జట్టును విజయవంతంగా నడిపాడు. 2020 టీ20 ప్రపంచకప్‌లో హర్మన్‌ ప్రీత్‌ సేన ఫైనల్‌దాకా వెళ్లడంలో రామన్‌ కీలకపాత్ర పోషించాడు. అంతకముందు పొవార్‌ 2018లో టీమిండియా మహిళల జట్టుకు కొంతకాలం పాటు హెడ్‌ కోచ్‌గా సేవలందించాడు. అప్పటి కోచ్‌ తుషార్‌ ఆరోతే పదవికి రాజీనామా చేయడంతో బాధ్యతలు తీసుకున్న పొవార్‌ నవంబర్‌ 30, 2018 వరకు హెడ్‌ కోచ్‌గా ఉన్నాడు. ఇక పొవార్‌ టీమిండియా తరపున 31 వన్డే మ్యాచ్‌లాడి 34 వికెట్లు.. 2 టెస్టులాడి 6 వికెట్లు తీశాడు.

గతంలో సీనియర్‌ క్రికెటర్‌తో పొడచూపిన విబేధాల కారణం గా పొవార్‌ గతంలో మూడు నెలల కాలనికి మాత్రమే కోచ్‌గా వ్యవహరించాడు. ఆ తర్వాత పొవార్‌ను కొనసాగించడానికి ఇష్టపడని బీసీసీఐ.. డబ్యూవీ రామన్‌ను కోచ్‌గా నియమించింది. కాగా, మళ్లీ తాను కోచ్‌ పదవికి దరఖాస్తు చేసుకున్న పొవార్‌.. అందరికంటే ఎక్కువ మార్కులు కొట్టేసి భారత మహిళా క్రికెట్‌ జట్టు కోచ్‌గా మరొకసారి ఎంపిక కావడం విశేషం.
చదవండి: ICC Rankings: టాప్‌లో టీమిండియా.. దక్షిణాఫ్రికా చెత్త రికార్డు

మమ్మల్ని చూసే ద్రవిడ్‌ అలా...

మరిన్ని వార్తలు