సెలక్షన్‌ ప్యానెల్‌; రేసులో అగార్కర్‌, మోంగియా

24 Dec, 2020 15:54 IST|Sakshi

న్యూఢిల్లీ: సెలక్టర్ల ఎంపికకు సంబంధించిన ప్రక్రియను బీసీసీఐ క్రికెట్‌ అడ్వైజరి కమిటీ (సీఏసీ) వేగవంతం చేసింది. మదన్‌లాల్‌, ఆర్పీ సింగ్‌, సులక్షణ నాయక్‌ నాయకత్వంలోని సీఏసీ.. సెలక్షన్‌ ప్యానెల్‌(పురుషుల క్రికెట్‌) నియామక ప్రక్రియను గురువారం ప్రారంభించింది. ఈ మేరకు అజిత్‌ అగార్కర్‌, చేతన్‌ శర్మ, మనీందన్‌ సింగ్‌, నయన్‌ మోంగియా, ఎస్‌ఎస్‌ దాస్‌ పేర్లను షార్ట్‌లిస్టు చేసినట్లు తెలుస్తోంది. వీరితో పాటు అభయ్‌ కురువిల్లా, అజయ్‌ రత్రా, నిఖిల్‌ చోప్రా, దేవాశిష్‌ మహంతి, రణదేవ్‌ బోస్‌ పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అర్హులైన వారిని వర్చువల్‌గా ఇంటర్వ్యూ చేసి తుది నిర్ణయం తీసుకోనుంది.(చదవండి: 'నీకు చాన్స్‌ ఇద్దామనే అలా చేశా')

కాగా స్క్రూటినీ అనంతరం సీఏసీ ఎంపిక చేసిన పేర్లను బీసీసీఐకి పంపిస్తుంది. ఇక గురువారం బీసీసీఐ జనరల్‌ మీటింగ్‌ జరుగుతున్న నేపథ్యంలో సెలక్టర్ల నియామకానికి సంబంధించిన ప్రకటన నేడే వెలువడే అవకాశం ఉంది. జతిన్‌ పరంజపే, దేవాంగ్‌ గాంధీ, సరణ్‌దీప్‌ సింగ్‌ పదవీకాలం సెప్టెంబరులో పూర్తైన నేపథ్యంలో బీసీసీసీ దరఖాస్తులు ఆహ్వానించింది.  కాగా సెలక్టర్‌గా ఎంపిక అయ్యేందుకు కనీసం 7 టెస్టు మ్యాచ్‌లు లేదా 30 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు లేదా 10 వన్డేలు, 20 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడినవాళ్లు మాత్రమే అర్హులు. అదే విధంగా అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకొని కనీసం ఐదేళ్లు పూర్తై ఉండాలి. వయోపరిమితి 60 ఏళ్లు.

మరిన్ని వార్తలు