న్యూఢిల్లీ: కేంద్ర క్రీడా శాఖ మంత్రిగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఆ శాఖను నిర్వహించిన కిరణ్ రిజుజు ఇతర శాఖకు బదిలీ కావడంతో ఆయన ఈ బాధ్యతలను చేపట్టారు. ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ 2021కు సరిగ్గా రెండు వారాల ముందు కేంద్ర క్రీడల శాఖకు కొత్త మంత్రి వచ్చారు. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా అనురాగ్ ఠాకూర్కు ఈ అవకాశం లభించింది. హిమాచల్ ప్రదేశ్కు చెందిన 46 ఏళ్ల అనురాగ్ ఠాకూర్కు ఇదివరకే క్రీడలతో అనుబంధముంది. ఆయన గతంలో 2016 మే నుంచి 2017 ఫిబ్రవరి వరకు బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేశారు. అంతకుముందు బీసీసీఐ సెక్రటరీగా, హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ బోర్డు కార్యదర్శిగా పనిచేసిన అనుభవం అతనికుంది.
ఇదిలా ఉంటే, ఈనెల 23 నుంచి ఆగస్టు 8 వరకు టోక్యో వేదికగా విశ్వక్రీడలు జరగనున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా గతేడాదిగా వాయిదా పడుతూ వస్తున్న ఒలింపిక్స్ను జులై నెలలో ఎలాగైనా నిర్వహించాలని నిర్వాహకులు పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో గురువారం మంత్రివర్గంతో అత్యవసరంగా సమావేశమై జపాన్ ప్రధాని యొషిహిదె సుగా టోక్యోలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. దీంతో ఒలింపిక్స్ నిర్వహణపై మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి. మరోవైపు ఒలింపిక్స్ కోసం భారత్ నుంచి బయలదేరనున్న అథ్లెట్లు .. ఎప్పుడూ వెళతామో తెలియక కన్ఫ్యూజన్లో ఉన్నారు. దానికి తోడు కొత్త క్రీడా మంత్రి రావడంతో ఏం జరుగుతుందోనన్న అయోమయంలో ఉన్నారు.