350 కోట్లతో భారీ స్టేడియం నిర్మాణం.. బీసీసీఐ 100 కోట్ల ఆర్ధిక సాయం

4 Jul, 2021 17:06 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచంలో మూడో అతిపెద్ద క్రికెట్‌ స్టేడియాన్ని జైపూర్‌ పరిసరాల్లో నిర్మించేందుకు రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్(ఆర్‌సీఏ) ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. 75 వేల మంది సీటింగ్​సామర్థ్యంతో నిర్మంచ తలపెట్టిన ఈ ప్రాజెక్ట్‌కు.. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) రూ.100 కోట్ల భారీ అర్ధిక సాయం అందించనున్నట్లు ప్రకటించింది. అహ్మదాబాద్‌లోని మొతేరా, ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్​ క్రికెట్ గ్రౌండ్​తర్వాత మూడో అతిపెద్ద నిర్మాణంగా ఈ స్టేడియం నిలవనుంది. స్టేడియం నిర్మాణానికి ఇప్పటికే 100 ఎకరాల స్థలాన్ని ఆర్‌సీఏ లీజుకు తీసుకుంది. నిర్మాణ వ్యయం రూ.350 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేసింది. 

జైపూర్​శివారులో చోప్​గ్రామంలో ఈ మైదానాన్ని నిర్మంచనున్నట్లు ఆర్‌సీఏ అధికారులు తెలిపారు. ఇందుకోసం రూ.100 కోట్లను బ్యాంకు రుణాల ద్వారా సమకూర్చుకోనున్న ఆర్‌సీఏ.. మిగతా నిధులను కార్పొరేట్​బాక్స్‌ల విక్రయం ద్వారా సమీకరించనుంది. అత్యాధునిక సౌకర్యాలతో ప్రపంచ స్థాయి వసతులతో కొత్త స్టేడియం రూపుదిద్దుకోనున్నట్లు ఆర్‌సీఏ పేర్కొంది. ఇందులో ఇండోర్​గేమ్స్, శిక్షణ అకాడమీలు, క్లబ్​ హౌస్, భారీ పార్కింగ్ స్థలం, రెండు ప్రాక్టీస్​ గ్రౌండ్లు నిర్మించనున్నట్లు తెలిపింది. స్టేడియం నిర్మాణ పనులను ఈ ఏడాది ఆగస్టు లేదా సెప్టెంబరు‌లో ప్రారంభిస్తామని, రెండేళ్ల కాలవ్యవధిలో నిర్మాణం మొత్తాన్ని పూర్తి చేస్తామని ఆర్‌సీఏ వెల్లడించింది. 

కాగా, ప్రపంచపు అతిపెద్ద క్రికెట్‌ స్టేడియమైన మొతేరాను రూ.800 కోట్లు వచ్చించి అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించారు. ఈ గ్రౌండ్ సీటింగ్ కెపాసిటీ లక్షా 10 వేలు. 1,00,024 సామర్థ్యంతో అప్పటిదాకా అతిపెద్ద క్రికెట్‌ స్టేడియంగా ఉన్న ఎంసీజీ రికార్డును మొతేరా మైదానం బద్దలు కొట్టింది. ఇక ప్రపంచంలో అతిపెద్ద క్రీడా మైదానాల విషయానికొస్తే.. 1,14,000 సామర్థ్యమున్న ఉత్తర కొరియా రన్‌గ్రాడో మేడే స్టేడియం అగ్రస్థానంలో ఉంది. దీని తర్వాతి స్థానంలో మొతేరా మైదానం ఉంది. 

మరిన్ని వార్తలు