A+ Category For Umpires: బీసీసీఐ కొత్త పంథా.. ఆటగాళ్లకే కాదు అంపైర్లకు ప్రమోషన్‌

22 Jul, 2022 18:20 IST|Sakshi

క్రికెట్‌ ప్రపంచాన్ని శాసిస్తున్న బోర్డ్‌ ఆఫ్‌ కంట్రోల్‌ ఫర్‌ క్రికెట్‌ ఇన్‌ ఇండియా(బీసీసీఐ) అంపైర్ల విషయంలో కొత్త పంథాను అనుసరించింది. ఇన్నాళ్లు ఆటగాళ్లకు మాత్రమే ఉన్న ఏ-ప్లస్‌ గ్రేడ్‌ను అంపైర్లకు వర్తించేలా నిర్ణయం తీసుకుంది. ఐసీసీ ఎలైట్‌ ప్యానెల్‌ మెంబర్‌ అయిన నితిన్‌ మీనన్‌ సహా  మరో నలుగురు అంతర్జాతీయ అంపైర్లకు ఏ ప్లస్‌ కేటగిరిలో చోటు కల్పించింది. అనిల్‌ చౌదరీ, మదన్‌గోపాల్ జయరామన్‌, వీరేంద్ర కుమార్‌ శర్మ, కెఎన్‌ అనంతపద్మనాభన్‌ ఈ జాబితాలో ఉన్నారు.

గురువారం జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ మీటింగ్‌లో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. మాజీ అంతర్జాతీయ అంపైర్లు కె. హరిహరన్‌, సుదీర్‌ అనానీ, అమీష్‌ సాహెబా, బీసీసీఐ అంపైర్స్‌ సబ్‌ కమిటీ అపెక్స్‌ కౌన్సిల్‌ మీటింగ్‌ సందర్భంగా ఇచ్చిన రిపోర్టు మేరకు బీసీసీఐ ఏ-ప్లస్‌ కేటగిరిని కొత్తగా సృష్టించింది. ఇంతవరకు అంపైర్ల గ్రేడ్‌ కాంట్రాక్ట్‌ విషయంలో ఏ, బి, సి, డి కేటగిరీలు మాత్రమే ఉన్నాయి.

కొత్తగా చేర్చిన ఏ-ప్లస్‌, ఏ కేటగిరిలో ఉన్న అంపైర్లకు ఒక్కో ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌కు రూ.40 వేలు.. బి, సి కేటగిరిల్లో ఉన్న అంపైర్లకు రూ.30వేలు ఇవ్వనున్నట్లు సమాచారం. ఏ-ప్లస్‌లో ఐదుగురు ఉండగా.. ఏ-కేటగిరిలో 20 మంది అంపైర్లు, బి-కేటగిరిలో 60 మంది అంపైర్లు, సి-కేటగిరిలో 46 మంది అంపైర్లు ఉన్నారు.కమిటీ బీసీసీఐకి ఇచ్చిన నివేదికలో ఏ ప్లస్ కేటగిరీ ప్రతిపాదనను ‘గ్రేడేషన్ ఆఫ్ అంపైర్లు’గా పేర్కొంది.

అయితే బోర్డు స్వయంగా ఆ కేటగిరీని సృష్టించిందని బీసీసీఐ అధికారి ఒకరు స్పష్టం చేశారు. ఇవి ఏ-ప్లస్ కొత్త కేటగిరీతో కూడిన సమూహాలు. ఏ-ప్లస్‌తో పాటు ఏ- గ్రేడ్‌ భారతీయ అంపైర్ల క్రీమ్‌ను కలిగి ఉంటాయి. ఇక అంపైర్లకు విధులనేవి కేటగిరీ వారిగా నిర్ణయిస్తారని.. రంజీ ట్రోఫీ సహా మిగిలిన దేశవాలీ క్రికెట్‌ టోర్నీలకు ఇదే పంథాను అనుసరిస్తున్నట్లు ఒక సీనియర్‌ అధికారి పేర్కొన్నారు.

చదవండి: BCCI Case: గంగూలీ, జై షా పదవుల వ్యవహారం.. అమికస్‌ క్యూరీగా మణిందర్‌ సింగ్‌

ఇంగ్లండ్‌లో క్రికెట్‌ గ్రౌండ్‌కు టీమిండియా దిగ్గజం పేరు.. చరిత్రలో తొలిసారి

మరిన్ని వార్తలు