స్పాన్సర్‌షిప్‌ కోసం బీసీసీఐ ఆహ్వానం

3 Aug, 2020 15:56 IST|Sakshi

కిట్‌ స్పాన్సర్‌ కోసం బిడ్‌లకు పిలుపు

ఆటగాళ్ల ఫిర్యాదే కారణమా?

న్యూఢిల్లీ: ఒకవైపు చైనాకు చెందిన పలు యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించగా, భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) మాత్రం వివో సహా ఇతర చైనా కంపెనీలను స్పాన్సర్‌లుగా కొనసాగించడానికే మొగ్గు చూపుతోంది. ప్రధానంగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-13వ సీజన్‌కు కేంద్ర గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన తరుణంలో టైటిల్‌ స్పాన్సర్‌ అయిన వివోను కొనసాగిస్తూనే బీసీసీఐ ముందుకెళుతుంది. సాంకేతికపరమైన అడ్డంకులు ఉండటం కారణంగానే బీసీసీఐ ఇలా వ్యవహరిస్తున్నా విమర్శలు మాత్రం తారాస్థాయికి చేరుకున్నాయి. భారత్‌లో చైనా యాప్‌లను నిషేధిస్తారు.. చైనా స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ అయిన వివోను మాత్రం బీసీసీఐ కొనసాగిస్తుంది ఆంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఇదిలా ఉంచితే, తాజాగా జట్టు కిట్‌ స్పాన్సర్ కోసం బీసీసీఐ కొత్త బిడ్‌లను ఆహ్వానించింది.

ఇప్పటివరకూ కిట్‌ స్పాన్సర్‌గా ఉన్న నైకీ గడువు వచ్చే నెలతో ముగిసిపోవడంతో ఆ స్థానంలో కొత్త స్పాన్సర్‌షిప్‌ హక్కుల కోసం బీసీసీఐ బిడ్‌లకు పిలిచింది. అదే సమయంలో అధికారిక సామాగ్రి భాగస్వామ్య హక్కుల బిడ్‌లకు ఆహ్వానించింది. భారత క్రికెట్‌ జట్టుతో 2020 సెప్టెంబర్‌ వరకు కాంట్రాక్ట్‌ ఉన్న ‘నైకీ’... అందుకోసం గత ఏడాది బోర్డుకు రూ. 370 కోట్లు చెల్లించింది. మొత్తంగా తమ బ్రాండ్‌ను ధరిస్తున్నందుకు కాంట్రాక్ట్‌ అమల్లో ఉన్న సమయంలో జరిగే ఒక్కో అంతర్జాతీయ మ్యాచ్‌కు నైకీ దాదాపుగా 87 లక్షల 34 వేలు రూపాయలు బీసీసీఐకి చెల్లించింది.(ధోనితో పోలికపై రోహిత్‌ స్పందన)

ఆటగాళ్ల ఫిర్యాదే కారణమా..?
ప్రపంచంలోనే అత్యుత్తమ స్పోర్టింగ్‌ బ్రాండ్‌గా అగ్రస్థానంలో ఉన్న ‘నైకీ’ 2006 నుంచి భారత క్రికెట్‌ టీమ్‌కు భాగస్వామిగా వ్యవహరిస్తోంది.అయితే 2016లో మరొకసారి ఒప్పందం చేసుకున్న తర్వాతే అసలు కథ మొదలైంది. అధికారిక అపెరల్‌ పార్ట్‌నర్‌ ‘నైకీ’ తమకు అందజేస్తున్నకిట్‌లపై ఆటగాళ్లు అసంతృప్తిగా వ్యక్తం చేసినట్లు అప్పట్లోనే వార్తలు వచ్చాయి. ప్రధానంగా తమకు అందించే జెర్సీలు నాసిరకంగా ఉన్నాయని టీమిండియా కెప్టెన్‌  విరాట్‌ కోహ్లితో  పాటు పలువురు ఫిర్యాదు చేశారనేది ప్రధాన సారాంశం. దీనిలో భాగంగానే మధ్యలో ఒప్పందం రద్దు చేసుకోవడం కుదరదు కాబట్టి దానితో బీసీసీఐ కటీఫ్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది. (నా గులాబీకి గులాబీలు: హార్దిక్‌)

మరిన్ని వార్తలు