టీమిండియాకు సెలక్టర్లు కావలెను

11 Nov, 2020 08:33 IST|Sakshi

న్యూఢిల్లీ: సీనియర్‌ సెలక‌్షన్‌ కమిటీలో త్వరలో ఖాళీ అవుతున్న సెలక్టర్లను భర్తీ చేసేందుకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) సిద్ధమైంది. అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరుతూ మంగళవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దరఖాస్తులకు ఈ నెల 15 ఆఖరి తేదీ అని అందులో పేర్కొంది. కమిటీలోని దేవాంగ్‌ గాంధీ (ఈస్ట్‌జోన్‌), శరణ్‌దీప్‌ సింగ్‌ (నార్త్‌జోన్‌), జతిన్‌ పరాంజపే (వెస్ట్‌జోన్‌)ల పదవీ కాలం ఇదివరకే ముగిసినా... ఆసీస్‌ పర్యటన కోసం జట్లను ఎంపిక చేసేందుకు పొడిగింపు ఇచ్చింది. జట్ల ఎంపిక పూర్తి కావడంతో ఇక సెలక్టర్ల భర్తీపై బోర్డు దృష్టిసారించింది. ఇప్పటికే సౌత్‌జోన్‌ నుంచి ఖాళీ అయిన ఎమ్మెస్కే ప్రసాద్‌ (ఆంధ్రప్రదేశ్‌) స్థానంలో సునీల్‌ జోషి (కర్ణాటక), సెంట్రల్‌ జోన్‌లో గగన్‌ ఖోడా స్థానంలో హర్వీందర్‌ సింగ్‌లను నియమించింది.
(చదవండి: తొలి టెస్టు తర్వాత స్వదేశానికి కోహ్లి)

అర్హతలివే...
అంతర్జాతీయ అనుభవం లేకపోయినా... కనీసం 30 దేశవాళీ మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్లు సెలక్టర్ల పదవులకు దరఖాస్తు చేసుకోవచ్చు. గరిష్ట వయస్సు 60 ఏళ్లు. అంతర్జాతీయ క్రికెట్‌లో 7 టెస్టులు లేదంటే 10 వన్డేలు, 20 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన అనుభవమైనా ఉండాలి. అయితే ఈసారి అంతర్జాతీయ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత అని ఎక్కడా పేర్కొనలేదు. 30 దేశవాళీ మ్యాచ్‌లాడినా పరిగణమిస్తామని తెలిపింది. సెలక‌్షన్‌ కమిటీ కోసం ఇటీవల దరఖాస్తు చేసుకున్న మాజీ సీమర్‌ అజిత్‌ అగార్కర్‌, మణీందర్‌ సింగ్‌ల ఎంపికను కూడా పరిశీలిస్తారు. దరఖాస్తుల స్క్రూటినీ అయిన వెంటనే  మదన్‌లాల్‌ నేతృత్వంలోని క్రికెట్‌ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) అర్హత గల అభ్యర్థుల్ని ఇంటర్వ్యూ చేస్తుంది. అనంతరం ఈ సీనియర్‌ సెలక‌్షన్‌ కమిటీ భారత్‌తో పాటు భారత్‌ ‘ఎ’, దులీప్‌ ట్రోఫీ, దేవధర్‌ ట్రోఫీ, చాలెంజర్‌ ట్రోఫీ, రెస్టాఫ్‌ ఇండియా జట్లను ఎంపిక చేస్తుంది.
(చదవండి: నేను అలాంటి వాడిని కాదు: రోహిత్‌)

మరిన్ని వార్తలు