BCCI: క్రికెట్‌ అభిమానులకు శుభవార్త.. ఇకపై విదేశీ లీగ్‌లలో భారత క్రికెటర్లు..?

24 Jul, 2022 14:05 IST|Sakshi

భారత క్రికెటర్లు విదేశీ లీగ్‌ల్లో పాల్గొనకూడదనే నిబంధన విషయంలో బీసీసీఐ పట్టువీడనున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ లీగ్‌ల్లోని మెజార్టీ ఫ్రాంచైజీలు బీసీసీఐని నడిపిస్తున్న ఐపీఎల్‌ ఫ్రాంచైజీల యజమానుల చేతుల్లోనే ఉండటంతో బీసీసీఐ ఈ కీలక నిర్ణయం తీసుకోనుందని సమాచారం. త్వరలో దక్షిణాఫ్రికాలో ప్రారంభంకానున్న టీ20 లీగ్‌లో ఆరింటికి ఆరు జట్లను ఐపీఎల్‌ ఓనర్లే చేజిక్కించుకోవడంతో ఈ విషయమై బీసీసీఐపై ఒత్తిడి అధికమైందని భారత క్రికెట్‌ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. 

దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో భారత క్రికెటర్లు విదేశీ లీగ్‌ల్లో ఆడేందుకు బీసీసీఐ అంగీకరించిందని తెలుస్తోంది. ఈ విషయమై ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగే వార్షిక సాధారణ సమావేశంలో (ఏజీఎం) స్పష్టత రానుందని బీసీసీఐకి చెందిన కీలక ప్రతినిధి ఒకరు జాతీయ మీడియాకు తెలిపారు. కాగా, ప్రస్తుత నిబంధనల ప్రకారం బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకున్న ఏ పురుష క్రికెటర్‌కు విదేశీ లీగ్‌లలో ఆడేందుకు అనుమతి లేదు. రిటైరైన వాళ్లు, ఇకపై టీమిండియాకు ఆడబోమని భావించినవాళ్లతో పాటు మహిళా క్రికెటర్లకు  మాత్రమే ఫారెన్ లీగ్‌లలో ఆడే అవకాశముంది.
చదవండి: భారత్‌కు ఆసియా కప్‌, ప్రపంచకప్‌ అందించడమే నా ప్రధాన లక్ష్యం: కోహ్లి

మరిన్ని వార్తలు