ఆ ఐపీఎల్‌ ఆటగాళ్లకు జీతాలు కట్‌.. 

2 Jun, 2021 21:11 IST|Sakshi

దుబాయ్‌: కరోనా కారణంగా అర్ధంతరంగా ఆగిపోయిన ఐపీఎల్ 2021 సీజన్‌ను యూఏఈ వేదికగా సెప్టెంబర్-అక్టోబర్‌ మధ్యలో నిర్వహిస్తామని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఇటీవలే అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో షెడ్యూల్‌ రూపొందించే పనిలో బిజీగా ఉంది. అయితే సెకండాఫ్‌ మ్యాచ్‌లకు విదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉండరన్న ఊహాగానాల నేపథ్యంలో ఫ్రాంచైజీల యాజమాన్యాలు ఆయా దేశాలకు చెందిన ఆటగాళ్లపై చర్యలకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.

ఐపీఎల్‌ సెకండ్‌ లెగ్‌ మ్యాచ్‌లు ఆడేందుకు యూఏఈకి రాని విదేశీ ఆటగాళ్ల జీతాల్లో కోత విధించాలని నిర్ణయించినట్లు బీసీసీఐకి చెందిన ఓ ముఖ్య అధికారి తెలిపారు. ఇప్పటి వరకు వారు ఆడిన మ్యాచ్‌లకు మాత్రమే వేతనాలు చెల్లిస్తామని, మిస్‌ కాబోయే మ్యాచ్‌లకు ఎటువంటి జీతం చెల్లించబోమని ఆయన వెల్లడించారు. అయితే బీసీసీఐతో ఒప్పంద కుదుర్చుకున్న ఆటగాళ్లకు మాత్రం ఎలాంటి కోత ఉండబోదని పేర్కొన్నారు. 

కాగా, విదేశీ ఆటగాళ్లు పూర్తిగా ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడకపోతే పారితోషికంలో కోత పెట్టే హక్కు ఫ్రాంచైజీ యాజమాన్యలకు ఉంటుందని సదరు అధికారి తెలిపారు. ఇదిలా ఉంటే, ఎవరు వచ్చినా రాకపోయినా ఐపీఎల్ మాత్రం ఆగదని ఇటీవలే బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. ఫ్రాంచైజీల తాజా నిర్ణయంతో ఐపీఎల్‌కు డుమ్మా కొట్టాలనుకున్న విదేశీ ఆటగాళ్లలో ఆందోళన మొదలైంది. ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌కు చెందిన కొందరు క్రికెటర్లు ద్వైపాక్షిక సిరీస్‌ల నేపంతో ఐపీఎల్‌ ఆడబోమని ఇదివరకే స్పష్టం చేశారు.
చదవండి: ముంబై కోచ్‌గా దేశవాళీ క్రికెట్‌ దిగ్గజం..

>
మరిన్ని వార్తలు