Women IPL: ఆరు జట్లతో మహిళల ఐపీఎల్‌.. ఎప్పటి నుంచి అంటే..?

18 Apr, 2022 18:56 IST|Sakshi

మహిళల క్రికెట్‌కు సంబంధించి ఓ గుడ్‌ న్యూస్‌ వచ్చింది. విశ్వవ్యాప్తంగా ఉన్న మహిళా క్రికెటర్లు, అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వుమెన్స్ ఐపీఎల్‌కు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. పురుషుల ఐపీఎల్‌ తరహాలోనే వచ్చే ఏడాది (2023) నుంచి ఆరు జట్లతో కూడిన మహిళా ఐపీఎల్‌ నిర్వహించేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. తాజాగా జరిగిన మహిళ వన్డే వరల్డ్ కప్‌ ఊహలకతీతంగా సక్సస్‌ కావడంతో మహిళల ఐపీఎల్‌కు పావులు చకచకా కదులుతున్నాయి. 

తాజాగా జరిగిన బీసీసీఐ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్‌లో వుమెన్స్ ఐపీఎల్ గురించి చర్చించిన అధికారులు, వచ్చే ఏడాది వేసవిలో ఆరు జట్లతో లీగ్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. లీగ్‌కు సంబంధించి పూర్తి సమాచారం అతి త్వరలో వెల్లడించే అవకాశం ఉంది. కాగా, ఐపీఎల్ తర్వాత ప్రారంభమైన బిగ్ బాష్ లీగ్‌, కరీబియన్ ప్రీమియర్ లీగ్‌ల్లో ఇదివరకే మహిళల టోర్నీలు మొదలయ్యాయి. ఈ టోర్నీలకు పురుషుల టోర్నీలతో సమానంగా ఆదరణ లభిస్తుంది. స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ వంటి భారత ప్లేయర్లు బీబీఎల్‌లో పాల్గొని సత్తా చాటారు.
చదవండి: 'బంగారు' వేదాంత్‌.. డానిష్‌ ఓపెన్‌లో రెండో పతకం సాధించిన మాధవన్‌ కొడుకు

మరిన్ని వార్తలు