డెల్టా దాడి.. ఈసారి టీ 20 ప్రపంచ కప్‌ విదేశాల్లో..?

26 Jun, 2021 17:22 IST|Sakshi

భారత్‌లో కోవిడ్‌ నేపథ్యంలో వేదిక మార్పుపై బీసీసీఐ యోచన

టీ-20 వరల్డ్‌కప్‌కు యూఏఈ అనుకూలం: బీసీసీఐ

ముంబై: కరోనా మహమ్మారి కారణంగా ప్రజల జీవనవిధానాల్లో చాలా మార్పులే చోటుచేసుకున్నాయి. ఈ వైరస్‌ కారణంగా అవే మార్పులు క్రికెట్‌ వేదికలపై కూడా పడతోంది. ముందస్తు నిర్ణయాల ప్రకారం ఈ ఏడాది టీ20 ప్రపంచకప్​ భారత్​లో జరగాల్సి ఉంది. కానీ భారత్‌లో కోవిడ్‌ డెల్టా వేరియంట్‌ విజృంభణ కారణంగా ప్రపంచకప్‌ ఇక్కడ జరిగే అవకాశం దాదాపు లేనట్టు స్పష్టంగా తెలుస్తోంది.

ఇప్పటికే ఈ మెగా టోర్నీని సజావుగా నిర్వహించడం కోసం ఐసీసీని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గడువు కూడా కోరింది. కానీ ప్రస్తుత వైరస్‌ వ్యాప్తి, ఆటగాళ్ల రక్షణ దృష్ట్యా ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌ను యూఏఈలో జరిపేందుకు బీసీసీఐ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఐసీసీకి సమాచారం కూడా ఇచ్చిందని తెలుస్తోంది. 

ఈ అంశంపై బీసీసీఐ కార్య‌ద‌ర్శి జే షా మాట్లాడుతూ.. ప్ర‌స్తుతం కరోనా కారణంగా భారత్‌లో పరిస్థితులను స‌మీక్షిస్తున్నామ‌ని, ఇక టోర్నీలో పాల్గొనే ఆటగాళ్ల ఆరోగ్యం, ర‌క్ష‌ణే ముఖ్యమన్నారు. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచక‌ప్‌ను భారత్‌ లేదా యూఏఈలో నిర్వహించాలా అనే విషయంపై త్వ‌ర‌లోనే బీసీసీఐ నిర్ణ‌యం తీసుకుంటుందని తెలిపారు. ఇదిలా ఉండగా గతంలో అక్టోబ‌ర్ 17 నుంచి యూఏఈలో ప్రపంచకప్‌ టోర్నీని నిర్వ‌హించే అవ‌కాశాలు ఉన్నట్లు, ఫైన‌ల్ మ్యాచ్‌ను న‌వంబ‌ర్ 14వ తేదీన నిర్వహించేలా ప్లాన్‌ చేస్తున్నట్లు వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అయితే ఈ వార్తలపై స్పష్టత రావాల్సి ఉంది.
 


చదవండి: ధోని మెసేజ్‌పై అభిమానుల ఆగ్రహం.. ట్వీట్‌ వైరల్‌

మరిన్ని వార్తలు