Rishabh Pant: ఎయిర్‌ అంబులెన్స్‌లో ముంబైకి పంత్‌.. అంబానీ ఆస్పత్రిలో చికిత్స.. ఖర్చు మొత్తం ఎవరిదంటే!

4 Jan, 2023 15:09 IST|Sakshi

BCCI To airlift Rishabh Pant To Mumbai: టీమిండియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ ఆరోగ్య పరిస్థితిపై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి మరో అప్‌డేట్‌ అందించింది. అతడిని ఎయిర్‌ అంబులెన్స్‌ ద్వారా ముంబైకి తరలించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు బుధవారం మీడియాకు ప్రకటన విడుదల చేసింది.

‘‘రిషభ్‌ పంత్‌ను ముంబై తరలించేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను బీసీసీఐ పూర్తి చేసింది. డిసెంబరు 30న డెహ్రాడూన్‌లో జరిగిన కారు ప్రమాదంలో గాయపడ్డ రిషభ్‌ ప్రస్తుతం మాక్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఎయిర్‌లిఫ్ట్‌
అతడిని ఎయిర్‌ అంబులెన్స్‌ ద్వారా ముంబైకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు జరిగాయి. పంత్‌ను కోకిలాబెన్‌ ధీరూబాయి అంబాని ఆస్పత్రి మెడికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో అడ్మిట్‌ చేస్తాం. ఆర్థోస్కోపీ& షోల్డర్‌ సర్వీస్‌, సెంటర్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ మెడిసిన్‌ అండ్‌ డైరెక్టర్‌, హెడ్‌ డాక్టర్‌ దీన్షా పర్దీవాలా పంత్‌ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తారు. 

ఆ డాక్టర్‌ పర్యవేక్షణలో
రిషభ్‌ లిగమెంట్‌ టియర్‌కు సర్జరీ చేయాల్సి ఉంది. ఆ తర్వాత అతడిని బీసీసీఐ వైద్య బృందం నిరంతరం పర్యవేక్షిస్తుంది. తను కోలుకునేంత వరకు ఇక్కడే ఉంటాడు. రిషభ్‌ పంత్‌కు మెరుగైన చికిత్స అందించేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయడం సహా.. ఈ కఠిన సమయంలో అతడికి అన్ని విధాలా అండగా ఉంటాం’’ అని బీసీసీఐ కార్యదర్శి జై షా పేరిట బోర్డు నోట్‌ విడుదల చేసింది. 

వైద్య ఖర్చులు మొత్తం
కాగా బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో అదరగొట్టిన రిషభ్‌ పంత్‌.. స్వదేశానికి వచ్చిన తర్వాత కుటుంబంతో కలిసి న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ చేసుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలో డిసెంబరు 30న ఢిల్లీ నుంచి స్వస్థలం ఉత్తరాఖండ్‌కు వస్తుండగా అతడి కారుకు యాక్సిడెంట్‌ జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఇక పంత్‌ బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ప్లేయర్‌ అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడి వైద్య ఖర్చులు మొత్తం బోర్డు భరిస్తుందని జై షా పేర్కొన్నారు. 

చదవండి: Sanju Samson: క్యాచ్‌ డ్రాప్‌ చేసిన సంజూ! హార్దిక్‌ పాండ్యా రియాక్షన్‌ వైరల్‌
Deepak Hooda: అసభ్య పదజాలం వాడిన హుడా! ఇంత నీచంగా మాట్లాడతావా అంటూ..

మరిన్ని వార్తలు