ఐదు సార్లు నెగెటివ్‌...

5 Aug, 2020 02:11 IST|Sakshi

ఐదు రోజులకోసారి పరీక్షలు 

ఐపీఎల్‌ నిబంధనల జాబితా విడుదల

ముంబై: కరోనా పరిస్థితుల్లో ఐపీఎల్‌ నిర్వహించనున్న బీసీసీఐ ఈ లీగ్‌లో పాల్గొనే ఆటగాళ్ల కోసం తగిన మార్గదర్శకాలు రూపొందించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ (ఎస్‌ఓపీ) డ్రాఫ్ట్‌ను తయారు చేసింది. 

దీని ప్రకారం.... 
► యూఏఈలో శిబిరానికి హాజరయ్యే ముందు భారత క్రికెటర్లు, సహాయక సిబ్బందికి వరుసగా ఐదు కరోనా టెస్టుల్లో నెగెటివ్‌ ఫలితం రావాలి. ఇందులో 24 గంటల వ్యవధిలో రెండు ఆర్‌టీ–పీసీఆర్‌ టెస్టులు జరుపుతారు. యూఏఈ బయలుదేరడానికి వారం రోజుల ముందు ఇది జరుగుతుంది. ఎవరికైనా పాజిటివ్‌ వస్తే వారు 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాలి. ఆ తర్వాత రెండు టెస్టులు నెగెటివ్‌గా వస్తేనే పంపిస్తారు.  
► యూఏఈ చేరుకున్న తర్వాత తొలి వారం రోజుల వ్యవధిలో మూడుసార్లు పరీక్షలు చేయించుకొని అన్నీ నెగెటివ్‌గా తేలాలి. అప్పుడే బయో బబుల్‌లోకి చేర్చి ప్రాక్టీస్‌కు అవకాశం ఇస్తారు. ఈ వారం సమయంలో ఆటగాళ్లు, సహాయక సిబ్బంది ఒకరితో మరొకరు కలవకూడదు.  
► ఐపీఎల్‌ జరిగే సమయంలో ప్రతీ 5వ రోజు క్రికెటర్లకు కోవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తారు. యూఏఈ నిబంధనల ప్రకారం అవసరమైతే ఇంతకంటే ఎక్కువ సంఖ్యలో కూడా టెస్టులు జరపవచ్చు.  
► క్రికెటర్ల కుటుంబసభ్యులను అనుమతించడంపై ఆయా ఫ్రాంచైజీలదే తుది నిర్ణయం. అయితే వారందరూ కూడా కచ్చితంగా బయో సెక్యూర్‌  నిబంధనలు పాటించాల్సిందే.  
► ఎవరైనా ఆటగాడు బయో బబుల్‌ నిబంధనలను ఉల్లంఘిస్తే వారం రోజులు మళ్లీ సెల్ఫ్‌ ఐసోలేషన్‌కు వెళ్లాల్సిందే. ఆ తర్వాత వరుసగా రెండు నెగెటివ్‌ పరీక్షలు వస్తేనే మళ్లీ అనుమతిస్తారు.

మరిన్ని వార్తలు