IND vs SA: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్.. కెప్టెన్‌గా ధావన్‌.. వైస్‌ కెప్టెన్‌గా శాంసన్‌!

27 Sep, 2022 11:13 IST|Sakshi
PC: INSIDE SPORT

స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్‌కు భారత జట్టును బుధవారం(సెప్టెంబర్‌ 28) బీసీసీఐ ప్రకటించే అవకాశం ఉంది. అయితే ప్రోటీస్‌తో వన్డే సిరీస్‌కు టీ20 ప్రపంచకప్‌-2022 భారత జట్టులో భాగంగా ఉన్న ఆటగాళ్లందరికీ విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా టీ20 ప్రపంచకప్‌ కోసం ఆక్టోబర్‌ 6వ తేదీన ఆస్ట్రేలియాకు పయనమవుతుంది.

అదే రోజున భారత్, సౌతాఫ్రికా మధ్య తొలి వన్డే కూడా లక్నో వేదికగా జరగనుంది. ఇక ప్రోటీస్‌తో వన్డే సిరీస్‌లో భారత జట్టు సారథ్య బాధ్యతలు వెటరన్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ చేపట్టే అవకాశం ఉంది. ధావన్‌ డిప్యూటీగా వికెట్‌ కీపర్‌ సంజూ శాంసన్‌ బాధ్యతలు నిర్వహించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అదే విధంగా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ సీనియర్‌ జట్టుతో ఆస్ట్రేలియాకు వెళ్లనుండడంతో అతడి స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. కాగా స్వదేశంలో న్యూజిలాండ్‌-ఏతో జరుగుతోన్న వన్డే సిరీస్‌లో అదరగొట్టిన భారత ఆటగాళ్లకు దక్షిణాఫ్రికా సిరీస్‌కు సెలక్టర్లు ఎంపికచేయనున్నట్లు సమాచారం.

“రోహిత్, విరాట్‌తో సహా టీ20 ప్రపంచకప్‌లో ఉన్న ఆటగాళ్లందరికీ దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి ఇవ్వబడుతుంది. శిఖర్ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. భారత్-ఎ వర్సెస్ న్యూజిలాండ్-ఎ మధ్య జరిగే 3వ వన్డే తర్వాత ప్రోటీస్‌ సిరీస్‌కు జట్టును ప్రకటిస్తారు అని బీసీసీఐ సీనియర్‌ అధికారి ఒకరు ఇన్‌సైడ్‌ స్పోర్ట్‌తో పేర్కొన్నారు.

కాగా భారత పర్యటనలో భాగంగా సౌతాఫ్రికా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. సెప్టెంబర్‌ 28న తివేండ్రం వేదికగా జరగనున్న తొలి టీ20తో ప్రోటీస్‌ టూర్‌ ప్రారంభం కానుంది.

దక్షిణాఫ్రికాతో వన్డేలకు భారత జట్టు(అంచనా): శిఖర్ ధావన్ (కెప్టెన్‌), శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, పృథ్వీ షా, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రాహుల్ త్రిపాఠి, రజత్ పాటిదార్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, ప్రసిద్ద్‌ మాలిక్ , కుల్దీప్ సేన్
 

మరిన్ని వార్తలు