-

#IPL2023: 292 డాట్‌బాల్స్‌.. లక్షకు పైగా మొక్కలు

31 May, 2023 13:32 IST|Sakshi

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ప్లేఆఫ్ మ్యాచ్‌ల ప్రారంభానికి ముందు స్పాన్సర్‌ టాటాతో కలిసి బీసీసీఐ సరికొత్త కార్యచరణ రూపొందించింది. ప్లేఆఫ్‌ మ్యాచ్‌ల్లో నయోదయ్యే ప్రతీ డాట్‌బాల్‌కు 500 మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తాజాగా ఐపీఎల్‌ 16వ సీజన్‌ ముగిసింది. గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్లో సీఎస్‌కే విజేతగా నిలిచి ఐదోసారి ఛాంపియన్‌గా అవతరించింది.

కాగా ప్లేఆఫ్‌ మ్యాచ్‌ల సమయంలో డాట్ బాల్ స్థానంలో గ్రీన్ ట్రీ ఇమేజ్ గ్రాఫిక్ ఉపయోగించారు. మరి ప్లేఆఫ్స్ దశలో ఆడిన మొత్తం నాలుగు మ్యాచ్‌ల్లో నమోదైన డాట్‌బాల్స్‌కు ఎన్ని మొక్కలు నాటనున్నారో ఇప్పుడు చూద్దాం.

గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఇరు జట్ల బౌలర్లు 40 ఓవర్లలో మొత్తం 84 డాట్ బాల్స్ వేశారు. లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఇరు జట్ల బౌలర్లు చేసిన మొత్తం డాట్ బాల్స్ సంఖ్య 96.ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన 2వ క్వాలిఫయర్ మ్యాచ్‌లో కేవలం 67 డాట్ బాల్స్ వచ్చాయి. అలాగే చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మొత్తం డాట్ బాల్స్ 45. అంటే 4 మ్యాచ్‌ల నుంచి మొత్తం 292 డాట్ బాల్స్ ఉన్నాయి.

అంటే 292 x 500 లెక్కన బీసీసీఐ మొత్తం 1 లక్షా 46 వేల మొక్కలు నాటనుంది. దీని ద్వారా గ్రీన్ డాట్ ప్రచారంలో ఐపీఎల్ హరిత విప్లవానికి శ్రీకారం చుట్టడం విశేషం. పర్యావరణం పట్ల బీసీసీఐ బాధ్యతగా వ్యవహరిస్తూ ఈ కొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. ఇది అందరినీ ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో దీనిపై చాలా మంది హర్షం వ్యక్తం చేశారు. డాట్ బాల్‌కు మొక్కలు నాటాలన్న నిర్ణయంతో క్రికెట్ అభిమానుల మెప్పు పొందుతోంది బీసీసీఐ.

చదవండి: '45 రోజుల్లో ఎన్నికలు నిర్వహించకపోతే వేటు తప్పదు'

లండన్‌ చేరుకున్న రోహిత్‌ శర్మ.. టీమిండియాతో కలిసి ప్రాక్టీస్‌

మరిన్ని వార్తలు