‘ఇదే ఆల్‌టైమ్‌ అత్యుత్తమ టీమిండియా జట్టు’

25 Mar, 2021 11:53 IST|Sakshi

ఆంటిగ్వా: తాను చూసిన భారత క్రికెట్‌ జట్లలో ప్రస్తుత టీమిండియా జట్టునే అత్యుత్తమం అని విండీస్‌ దిగ్గజ క్రికెటర్‌ క్లైవ్‌ లాయిడ్‌ అభిప్రాయపడ్డాడు. తాను ఇంతవరకూ ఈ తరహా భారత క్రికెట్‌ జట్టును చూడలేదని పేర్కొన్నాడు. వరుస సిరీస్‌ విజయాలను సాధిస్తూ దూసుకుపోతున్న టీమిండియాపై లాయిడ్‌ ప్రశంసలు కురిపించాడు. అన్ని విభాగాల్లోనూ ఆ జట్టు అత్యంత పటిష్టంగా ఉందనడంలో ఎటువంటి సందేహం లేదని కొనియాడాడు. ప్రస్తుత టీమిండియా క్రికెట్‌ జట్టు ప్రొఫెషనల్‌ ఆటగాళ్లతో నిండి ఉందన్నాడు. ‘ద టెలీగ్రాఫ్‌’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లాయిడ్‌ మాట్లాడుతూ.. ‘ ఆస్ట్రేలియాలో తొలి టెస్టు ఓడిపోయిన తర్వాత భారత జట్టు పుంజుకున్న తీరు అమోఘం. గత భారత జట్టులు కంటే ప్రస్తుత జట్టు బలంగా ఉంది. ఆస్ట్రేలియాలో ఆ జట్టును ఓడించాలంటే గతంలో భారత్‌కు సవాల్‌గా ఉండేది. అటువంటి ఇప్పుడు దానిని టీమిండియా అధిగమించింది. ఆ సిరీస్‌ ప్రకారం చూస్తే ప్రస్తుత భారత క్రికెట్‌ జట్టును ‘ఆల్‌టైమ్‌’ బెస్ట్‌ టీమ్‌ అనక తప్పదు’ అని పేర్కొన్నాడు. ఇక్కడ చదవండి: ధోని భయ్యా.. నాకు ఎల్‌ సైజ్‌ జెర్సీ పంపు: జడేజా


బుమ్రాపై ప్రశంసల జల్లు

భారత జట్టులో ప్రధాన పేసర్‌గా కొనసాగుతున్న జస్‌ప్రీత్‌ బుమ్రాపై లాయిడ్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. ‘ బుమ్రా ఇప్పటికే అతనేమిటో నిరూపించుకున్నాడు. అతని బౌలింగ్‌లో ప్రత్యేక వైవిధ్యం ఉంది. యార్కర్లు, బౌన్సర్లు, స్లో బాల్స్‌తో ప్రత్యర్థిని బెంబేలెత్తిస్తున్నాడు. ఏ సమయంలోనైనా బుమ్రా చేతికి బంతి ఇస్తే అద్భుతాలు చేస్తున్నాడు. టీమిండియా వరుస విజయాలు సాధించడానికి బుమ్రా ప్రధాన కారణం అని చెప్పక తప్పదు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బుమ్రా ఆదుకునే తీరు అమోఘం’ అని కొనియాడాడు.

మరిన్ని వార్తలు