Ind vs Aus: మీకు తుదిజట్టులో చోటు ఉండట్లేదు కదా? నాకేం బాధ లేదు: షమీ కౌంటర్‌

23 Sep, 2023 20:34 IST|Sakshi

India vs Australia, 1st ODI- Mohammed Shami: నైపుణ్యం, అనుభవం ఉన్నా సరే గత కొంతకాలంగా టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ బెంచ్‌కే పరిమితం అవ్వాల్సి వస్తోంది. ప్రధాన పేసర్లుగా జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌కు మేనేజ్‌మెంట్‌ ప్రాధాన్యం ఇస్తుండటంతో ఈ వెటరన్‌ ఫాస్ట్‌బౌలర్‌కు చాలాసార్లు నిరాశే ఎదురవుతోంది.

ఆసియా కప్‌-2023 టోర్నీలో బుమ్రా లేదంటే సిరాజ్‌ గైర్హాజరీలో మాత్రమే షమీకి తుదిజట్టులో చోటు దక్కింది. ఇక వన్డే వరల్డ్‌కప్‌-2023 సన్నాహకంగా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లోనూ ఈ సీనియర్‌ పేసర్‌కు ఛాన్స్‌ వస్తుందా లేదా అన్న సందేహాలు నెలకొన్న వేళ.. తొలి మ్యాచ్‌లో సిరాజ్‌కు విశ్రాంతినిచ్చారు.

దీంతో మొహాలీలో శుక్రవారం నాటి మ్యాచ్‌లో బరిలోకి దిగిన షమీ ఏకంగా ఐదు వికెట్లతో చెలరేగాడు. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై 10 ఓవర్ల బౌలింగ్‌లో 51 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు కూల్చాడు. ఆస్ట్రేలియాను 276కు కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించిన షమీని మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు వరించింది.

ఈ నేపథ్యంలో విజయానంతరం మీడియాతో మాట్లాడిన షమీకి తరచూ జట్టు నుంచి తప్పించడం గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులుగా.. ‘‘నేను రెగ్యులర్‌గా జట్టులో ఉన్నపుడు ఎవరో ఒకరు బెంచ్‌ మీద కూర్చుంటారు కదా!

కౌంటర్‌ అదుర్స్‌
నేను కూడా అంతే! ఇందులో బాధపడాల్సింది, గిల్టీగా ఫీల్‌ కావాల్సింది ఏమీ లేదు. జట్టు ప్రయోజనాలే ముఖ్యం. నేను లేకుంటే ఏంటి.. జట్టు గెలుస్తూనే ఉంది కదా! టీమ్‌ప్లాన్‌కు అనుగుణంగా మార్పులు చేర్పులు ఉంటాయి. ప్రతిసారి ప్లేయింగ్‌ ఎలెవన్‌లో చోటు దక్కకపోవచ్చు. జట్టు కూర్పుపైనే అంతా ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మనకి అవకాశం వస్తే మంచిదే!

లేదంటే మ్యాచ్‌ ఆడుతున్న వాళ్లకి మద్దతుగా ఉండాలంతే! మేనేజ్‌మెంట్‌ నాకు ఎప్పుడు ఎలాంటి పని అప్పగించినా దానిని పూర్తిచేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను’’ అని షమీ అదిరిపోయే జవాబు ఇచ్చాడు. రొటేషన్‌ పాలసీ ఉండటం సహజమని.. ఇందులో ఎవరినీ తప్పుబట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు. ఈ విషయంలో నాకెంత అవగాహన ఉందో తెలుసుకోవడానికే ఈ ప్రశ్న అడిగారు కదా అంటూ కౌంటర్‌ వేశాడు.

ఆధిక్యంలో టీమిండియా
ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్లు రుతురాజ్‌ గై​క్వాడ్‌ 71, శుబ్‌మన్‌ గిల్‌ 74 పరుగులతో అదరగొట్టడం సహా కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌(58 నాటౌట్‌), సూర్యకుమార్‌ యాదవ్‌(50) అర్ధ సెంచరీలతో రాణించిన విషయం తెలిసిందే.దీంతో ఐదు వికెట్ల తేడాతో గెలిచిన భారత్‌ 1-0తో ఆధిక్యంలో నిలిచింది.

చదవండి: Ind vs Aus: తప్పు నీదే.. వరల్డ్‌కప్‌ జట్టు నుంచి తీసేయడం ఖాయం.. జాగ్రత్త!

మరిన్ని వార్తలు