Rohit Sharma: వాళ్లిద్దరు అలా.. ఇతడిలా! ‘𝐑𝐑𝐑’పై సచిన్‌ ప్రశంసల వర్షం.. ట్వీట్‌ వైరల్‌

10 Feb, 2023 16:40 IST|Sakshi

India vs Australia, 1st Test- Sachin Tendulkar: బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో మొదటి టెస్టు తొలి రోజు ఆటలో టీమిండియా స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అద్భుతం చేసిన సంగతి తెలిసిందే. జడ్డూ 5 వికెట్లతో చెలరేగి ఆసీస్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసిస్తే.. అశూ మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

‘రవి’లిద్దరూ సూపర్‌
గాయం నుంచి కోలుకుని.. చాలా రోజుల తర్వాత పునరాగమనం చేసిన జడేజా తొలి రోజు ఆటలో మొత్తంగా 22 ఓవర్లు వేసి 47 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లతో రాణించడం విశేషం. మరోవైపు అశ్విన్‌ 15.5 ఓవర్లలో 42 పరుగులు ఇచ్చాడు. ఈ స్పిన్‌ద్వయం ధాటికి ఆసీస్‌ 177 పరుగులకే కుప్పకూలింది.

ఈ క్రమంలో రెండో రోజు ఆటలో ఆస్ట్రేలియా అరంగేట్ర స్పిన్నర్‌ టాడ్‌ మర్ఫీ చెలరేగగా.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ భారత జట్టును ఆదుకున్నాడు.  ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌(20), వన్‌డౌన్‌ బ్యాటర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌(23), ఛతేశ్వర్‌ పుజారా(7) విరాట్‌ కోహ్లి(12), సూర్యకుమార్‌ యాదవ్‌(8) పెవిలియన్‌కు క్యూ కట్టినా తాను మాత్రం పట్టుదలగా నిలబడ్డాడు.

సచిన్‌ ప్రశంసల జల్లు
సెంచరీ(120)తో చెలరేగి కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. హిట్‌మ్యాన్‌ అద్భుత ప్రదర్శన కారణంగా... టీమిండియా ఆధిక్యంలోకి దూసుకొచ్చింది. ఇక రెండో రోజు ఆటలో భాగంగా జడేజా అర్ధ శతకం కూడా బాది సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ రోహిత్‌, జడేజా, అశ్విన్‌లపై ప్రశంసల వర్షం కురిపించాడు. ట్రిపుల్‌ఆర్‌(RRR) సూపర్‌ అంటూ కితాబులిచ్చాడు.

‘‘ఈ మేరకు రోహిత్‌, రవీంద్ర, రవిచంద్రన్‌.. ఈ త్రయం వల్లే టీమిండియా మొదటి టెస్టులో ముందంజలో సాగుతోంది. రోహిత్‌ తన సెంచరీతో విలువైన ఇన్నింగ్స్‌ ఆడితే.. అశ్విన్‌, జడేజా జట్టుకు అవసరమైన సమయంలో వికెట్లు తీశారు’’ అంటూ సచిన్‌ ట్వీట్‌ చేశాడు. ట్రిపుల్‌ఆర్‌(RRR) మాంచి జోష్‌లో ఉన్నారన్నట్లు ఫైర్‌ ఎమోజీని జత చేశాడు. సచిన్‌ ట్వీట్‌ లైకులు, రీట్వీట్లతో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

చదవండి: Rohit- Jadeja: అసలే అతడికి కాస్త పిచ్చి.. నువ్వెందుకిలా? జడ్డూకు రోహిత్‌ వార్నింగ్‌!
BGT 2023: టీమిండియాకు భారీ షాక్‌.. ఆసీస్‌తో టెస్ట్‌ సిరీస్‌ నుంచి స్టార్‌ ప్లేయర్‌ ఔట్‌

మరిన్ని వార్తలు