ఐసీసీ అధికారిక భాగస్వామిగా భారత్‌పే

7 Jun, 2021 18:51 IST|Sakshi

దుబాయ్‌: డిజిట‌ల్ పేమెంట్స్ స్టార్టప్ కంపెనీ అయిన‌ భార‌త్‌పే మూడేళ్ల కాలం పాటు ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అధికారిక భాగస్వామిగా వ్యవహరించనుంది. ఈ మేరకు సోమవారం ఐసీసీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా 2023 వ‌ర‌కు బ్రాడ్‌కాస్ట్‌, డిజిట‌ల్ ప్లాట్‌ఫామ్స్‌పై వీరి కలయికను భార‌త్‌పే ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. అలాగే అభిమానుల‌తో ఎప్పటిక‌ప్పుడు ఎంగేజ్ అవుతూ ప్రచారాలను సైతం నిర్వహించ‌నుంది. 

కాగా, ఈ మూడేళ్ల కాలంలో చాలా ముఖ్యమైన ఐసీసీ ఈవెంట్లు జ‌ర‌గ‌నున్నాయి. ప్రపంచ టెస్ట్ ఛాంపియ‌న్షిప్ ఫైన‌ల్‌తోపాటు పురుషుల టీ20 ప్రపంచక‌ప్(2021, 2022), మహిళల వన్డే ప్రపంచక‌ప్(2022), అండ‌ర్‌-19 ప్రపంచక‌ప్(2022), వుమెన్స్ టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ (2022), పురుషుల వ‌న్డే ప్రపంచక‌ప్(2023), ప్రపంచ టెస్ట్ ఛాంపియ‌న్షిప్(2023).. ఇలా మూడేళ్లపాటు ఐసీసీ షెడ్యూల్‌ బిజీగా ఉంది. 

ఇదిలా ఉంటే, ఇప్పటికే భార‌త్‌పే త‌న బ్రాండ్‌ను ప్రమోట్ చేసుకునే పనిలో పడింది. 11 మంది క్రికెట‌ర్లు ఈ కంపెనీ బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా వ్యవహరిస్తున్నారు. టీమిండియా స్టార్ క్రికెట‌ర్లు రోహిత్ శ‌ర్మ, జస్ప్రీత్‌ బుమ్రా, కేఎల్ రాహుల్‌, మహ్మద్‌ ష‌మీ, రవీంద్ర జ‌డేజా, సురేశ్‌ రైనా, శ్రేయ‌స్ అయ్యర్‌, పృథ్వీ షా, సంజు శాంస‌న్, చహ‌ల్, శుభ్‌మ‌న్ గిల్ భార‌త్‌పేతో ఒప్పందం కుదుర్చుకున్నారు. కాగా, భారత్‌పేను అశ్‌నీర్ గ్రోవ‌ర్‌, శాశ్వత్ న‌క్రానీలు 2018లో ప్రారంభించారు. ప్రస్తుతం ఈ కంపెనీకి దాదాపు 100 న‌గ‌రాల్లో 60 ల‌క్షల మంది మ‌ర్చంట్లు ఉన్నారు.
చదవండి: పాపం రాబిన్సన్‌.. క్షమించమని కోరినా కనికరించలేదు
 

>
మరిన్ని వార్తలు