Paris Olympics: భారత్‌కు ‘పారిస్‌’ తొలి బెర్త్‌ ఖరారు

29 Sep, 2022 05:56 IST|Sakshi

ట్రాప్‌ షూటర్‌ భౌనీష్‌కు నాలుగో స్థానం  

ఒసిజెక్‌ (క్రొయేషియా): ప్రపంచ షూటింగ్‌ షాట్‌గన్‌ చాంపియన్‌షిప్‌లో భారత యువ షూటర్‌ భౌనీష్‌ మెందిరత్తా త్రుటిలో కాంస్య పతకాన్ని కోల్పోయాడు. అయితే తన ప్రదర్శనతో అతను 2024 పారిస్‌ ఒలింపిక్స్‌ షూటింగ్‌ ఈవెంట్‌లో భారత్‌కు తొలి బెర్త్‌ను ఖరారు చేశాడు. బుధవారం జరిగిన పురుషుల ట్రాప్‌ ఈవెంట్‌లో హరియాణాకు చెందిన 23 ఏళ్ల భౌనీష్‌ ఫైనల్లో నాలుగో స్థానంలో నిలిచాడు. ఎలిమినేషన్‌ పద్ధతిలో నలుగురు పోటీపడిన ఫైనల్లో భౌనీష్‌ 13 పాయింట్లు స్కోరు చేసి ముందుగా నిష్క్రమించాడు.

అయినప్పటికీ ఫైనల్‌ చేరడంద్వారా భౌనీష్‌ భారత్‌కు తొలి ఒలింపిక్‌ బెర్త్‌ను అందించాడు. స్కాట్‌ డెన్రిక్‌ (అమెరికా; 33 పా యింట్లు), నాథన్‌ హేల్స్‌ (బ్రిటన్‌; 31 పాయింట్లు), కున్‌ పి యాంగ్‌ (చైనీస్‌ తైపీ; 23 పాయింట్లు) వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలు గెల్చుకోవడంతోపాటు తమ దేశాలకు ఒలింపిక్‌ బెర్త్‌లను ఖరారు చేశారు. అంతకుముందు 154 మంది షూటర్లు పాల్గొన్న క్వాలిఫయింగ్‌లో భౌనీష్‌ 121 పాయింట్లు స్కోరు చేసి నాలుగో స్థానంలో నిలిచి ఎనిమిది మంది పోటీపడే ర్యాంకింగ్‌ రౌండ్‌కు అర్హత సాధించాడు.

మరిన్ని వార్తలు