Harmanpreet Kaur: మరోసారి రెనెగేడ్స్‌తో జట్టు కట్టిన భారత కెప్టెన్‌! సంతోషంగా ఉంది!

4 Jul, 2022 12:29 IST|Sakshi
హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(ఫైల్‌ ఫొటో)

భారత మహిళా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ మహిళల బిగ్‌బాష్‌ టి20 క్రికెట్‌ లీగ్‌ ఎనిమిదో ఎడిషన్‌లో భాగం కానుంది. ఈ మేరకు ‘మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌’ జట్టుతో మరోసారి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని రెనెగేడ్స్‌ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది.

కాగా ఆస్ట్రేలియా టీ20 లీగ్‌లో భాగంగా హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ గత సీజన్‌లోనూ రెనెగేడ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. ఇందులో 33 ఏళ్ల హర్మన్‌ ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టింది. 406 పరుగులు సాధించడంతో పాటుగా 15 వికెట్లు పడగొట్టింది. 

ఈ నేపథ్యంలో మరోసారి హర్మన్‌ను తమ జట్టులో చేర్చుకోనుంది రెనెగేడ్స్‌. ఈ విషయం గురించి హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ రెనెగేడ్స్‌ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ.. మరోసారి ఈ జట్టుకు ఆడనుండటం ఎంతో సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేసింది. కాగా మిథాలీ రాజ్‌ రిటైర్మెంట్‌ ప్రకటించిన నేపథ్యంలో హర్మన్‌ భారత మహిళా జట్టు కెప్టెన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె సారథ్యంలోని భారత జట్టు శ్రీలంకలో పర్యటిస్తోంది.

వీళ్లు సైతం..
ఇప్పటికే బిగ్‌బాష్‌ లీగ్‌లో స్మృతి మంధాన, దీప్తి శర్మ (సిడ్నీ థండర్‌), షఫాలీ వర్మ, రాధా యాదవ్‌ (సిడ్నీ సిక్సర్స్‌) ఆడారు. ఈ లీగ్‌లో గత సీజన్‌తో జెమీమా తొలిసారి బరిలోకి దిగగా.. గతంలో సిడ్నీ థండర్‌కు ఆడిన హర్మన్‌ రెనెగేడ్స్‌కు మారింది. వచ్చే సీజన్‌లోనూ రెనెగేడ్స్‌కు ప్రాతినిథ్యం వహించనుంది.

చదవండి: Ind Vs Eng: 257 పరుగుల ఆధిక్యం.. ఇంగ్లండ్‌కు కష్టమే.. టీమిండియాదే విజయం: ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌
Sri Lanka vs India: మెరిసిన దీప్తి, రేణుక

మరిన్ని వార్తలు