గల్లీ క్రికెట్‌ను తలపించిన టీమిండియా వార్మప్‌ మ్యాచ్‌.. ఔటైనా నాటౌటే..!

26 Jun, 2022 17:00 IST|Sakshi

భారత్‌-లీస్టర్‌షైర్‌ జట్ల మధ్య జరుగుతున్న వార్మప్‌ మ్యాచ్‌ గల్లీ క్రికెట్‌ను తలపించింది. మూడో రోజు టీమిండియా బ్యాటింగ్‌ సమయంలో కొన్ని వింతలు చోటు చేసుకున్నాయి. భారత బ్యాటర్లు రవీంద్ర జడేజా, శ్రేయస్‌ అయ్యర్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఔటైన  మళ్లీ బ్యాటింగ్‌ కొనసాగించి అర్ధసెంచరీలు స్కోర్‌ చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో లీస్టర్‌షైర్‌ తరఫున ఆడిన నయా వాల్‌ పుజారా.. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా తరఫున.. రెండు ఇన్నింగ్స్‌ల్లో టీమిండియా తరఫున ఆడిన శుభ్‌మన్‌ గిల్‌ లీస్టర్‌షైర్‌ తరఫున రెండో ఇన్నింగ్స్‌లో మరోసారి బ్యాటింగ్‌కు దిగాడు. 

వార్మప్‌ మ్యాచ్‌ కావడంతో టీమిండియా ఆటగాళ్లు రూల్స్‌ను పక్కకు పెట్టి గట్టిగా ప్రాక్టీస్‌ చేశారు. ఇంగ్లండ్‌తో టెస్ట్‌కు ముందు జరుగుతున్న మ్యాచ్‌ కావడంతో భారత ఆటగాళ్లంతా సాధ్యమైనంత ఎక్కువ సేపు బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేశారు. ఈ మ్యాచ్‌లో మరో రోజు (నాలుగో రోజు) ఆట మిగిలి ఉంది. నాలుగో రోజు తొలి సెషన్‌ సమయానికి లీస్టర్‌షైర్‌ వికెట్‌ నష్టానికి 80 పరుగులు చేసింది. లీస్టర్‌షైర్‌ టీమిండియాపై గెలవాలంటే మరో 287 పరుగులు సాధించాల్సి ఉంది. శుభ్‌మన్‌ గిల్‌ (46), శామ్యూల్‌ ఈవాన్స్‌ (17) క్రీజ్‌లో ఉన్నారు. 

ఈ మ్యాచ్‌లో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 246/8.. రెండో ఇన్నింగ్స్‌లో 364/7 స్కోర్ల వద్ద డిక్లేర్‌ చేసింది. లిస్టర్‌షైర్‌ తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులకు ఆలౌటైంది. 

కాగా, ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కోవిడ్‌ బారిన పడిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ సమయానికి (జులై 1) రోహిత్‌ కోలుకోకపోతే బుమ్రా టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఇప్పటికే గాయం కారణంగా కేఎల్‌ రాహుల్‌, కోవిడ్‌ కారణంగా అశ్విన్‌ ఇంగ్లండ్‌తో టెస్ట్‌ మ్యాచ్‌కు దూరంగా ఉన్నారు. 
చదవండి: కోహ్లి, శ్రేయస్, రవీంద్ర జడేజా అర్ధ సెంచరీలు..

మరిన్ని వార్తలు