గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో గౌతమ్ గంభీర్.. 

12 Sep, 2021 19:26 IST|Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్.. తెలంగాణ రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. ఈ ఛాలెంజ్‌లో భాగంగా గంభీర్ ఢిల్లీలోని తన నివాస ప్రాంగణంలోని వివేకానంద పార్క్‌లో మొక్కలు నాటారు. అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి రాఘవ.. గంభీర్‌కు వృక్ష వేదం పుస్తకాన్ని బహుకరించారు. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అద్భుతమైన కార్యక్రమం అని ఈ సందర్భంగా గంభీర్ కొనియాడారు. 

ఈ మహత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని మొక్కలు నాటాలని, వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడం సంతోషంగా ఉందని, ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. గంభీర్‌ మొక్కలు నాటిన వీడియోను ఎంపీ సంతోష్ కుమార్‌ ట్విటర్‌ వేదికగా పంచుకున్నాడు. ఈ ఛాలెంజ్‌లో భాగమైనందుకు గంభీర్‌కు ధన్యవాదాలు తెలిపారు. కాగా, టీ20 ప్రపంచకప్ మెంటర్‌గా ధోని ఎంపికపై గంభీర్‌ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 
చదవండి: మెంటర్‌గా ధోని చేసేదేం ఉండదు.. గంభీర్‌ సంచలన వ్యాఖ్యలు
 

మరిన్ని వార్తలు