వరల్డ్‌కప్‌ విన్నర్‌.. నేడు కూరగాయల వ్యాపారి

21 Aug, 2020 17:18 IST|Sakshi

అహ్మదాబాద్‌ : ప్రాణాంతక కరోనా వైరస్‌ పౌరుల జీవితాలను అతలాకుతలం చేసింది. ప్రతి ఒక్కరిపై ఏదో ఒక విధంగా తన ప్రభావాన్ని, ప్రతాపాన్ని చూపిస్తోంది. వైరస్‌ ధాటికి ఎంతో మంది జీవితాలు తలకిందులు అయ్యాయి. బడా వ్యాపారుల నుంచి బడ్డీ కొట్టు చిరు వ్యాపారుల వరకు ప్రతి  ఒక్కరు తీవ్ర నష్టాలను చవి చూడాల్సిన పరిస్థితిని కరోనా కల్పించింది. ఈ క్రమంలోనే భారత అందుల క్రికెట్‌ జాతీయ జట్టుకుప్రాతినిధ్యం వహించిన ఓ క్రికెటర్‌‌ను సైతం కోవిడ్‌ తన ప్రతాపానికి లొంగదీసుకుంది. కోవిడ్‌ ధాటికి క్రికెటర్‌ కాస్తా.. కూరగాయల వ్యాపారిగా అవతారం ఎత్తాడు. ఓ జాతీయ మీడియా శుక్రవారం ప్రచురించిన కథనం ప్రకారం.. నరేష్‌ తుంబ్డా (29) అంధుల క్రికెట్‌ జట్టులో సభ్యుడు. 2018లో షార్జా వేదికగా జరిగిన ప్రపంచ కప్‌లో నరేష్‌ కీలక పాత్ర పోషించాడు.

లీగ్‌లో  ప్రధానంగా పాకిస్తాన్‌తో జరిగిన కీలక ఫైనల్‌ పోరులో భారత్‌ విజయం సాధించి ప్రపంచ కప్‌ గెలవడంలో ముఖ్యభూమిక పోషించాడు. దీంతో అతని పేరు దేశ వ్యాప్తంగా మారుమోగింది. అంతా బాగానే సాగుతున్న క్రమంలో కరోనా అతని జీవితంలోకి అనుకోని అతిథిలా వచ్చింది. కరోనా విపత్తు కారణంగా క్రికెట్‌కు తాత్కాలిక బ్రేక్‌ పడటంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. ఇక చేసేదేం లేక కుటుంబ సభ్యుల సహకారంతో కూరగాయల వ్యాపారం ప్రారంభించాడు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ సమీపంలో గల జమల్‌పూర్‌ మార్కెట్‌ అతని వ్యాపారానికి వేదికైంది. అతని ధీన పరిస్థితిని చూసి అనేక మంది చలించిపోతున్నారు. భారత క్రికెట్‌ యాజమాన్యం నరేష్‌ను ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు