Stuttgart Open: పోరాడి ఓడిన బోపన్న జోడీ..

11 Jun, 2022 08:06 IST|Sakshi

స్టుట్‌గార్ట్‌ (జర్మనీ): బాస్‌ ఓపెన్‌ ఏటీపీ–250 టెన్నిస్‌ టోర్నీలో రోహన్‌ బోపన్న (భారత్‌)–డెనిస్‌ షపోవలోవ్‌ (కెనడా) జంట పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్‌ సెమీఫైనల్లో బోపన్న–షపోవలోవ్‌ ద్వయం 6–7 (1/7), 6–7 (5/7)తో మూడో సీడ్‌ హుబెర్ట్‌ హుర్కాజ్‌ (పోలాండ్‌)–మ్యాట్‌ పావిచ్‌ (క్రొయేషియా) జంట చేతిలో ఓడిపోయింది. 83 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న జోడీ ఎనిమిది ఏస్‌లు సంధించడంతోపాటు ఆరు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది.

ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేసేందుకు పదిసార్లు అవకాశం లభించినా బోపన్న–షపోవలోవ్‌ ఒక్కసారీ సద్వినియోగం చేసుకోలేకపోయారు. అంతకుముందు జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో బోపన్న–షపోవలోవ్‌ 6–4, 3–6, 11–9తో నెదోవ్‌యెసోవ్‌ (కజకిస్తాన్‌)–ఐజామ్‌ ఉల్‌ హఖ్‌ ఖురేషీ (పాకిస్తాన్‌)లపై విజయం సాధించారు. సెమీస్‌లో ఓడిన బోపన్న జోడీకి 11,480 యూరోల ప్రైజ్‌మనీ (రూ. 9 లక్షల 43 వేలు)తోపాటు 90 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.
చదవండి: Mary Kom: కామన్‌వెల్త్‌ గేమ్స్‌ నుంచి వైదొలిగిన భారత దిగ్గజ బాక్సర్‌

మరిన్ని వార్తలు