Asia Cup 2022 Ind Vs Pak: పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ సంచలన ఆరోపణలు

29 Aug, 2022 21:45 IST|Sakshi

ఆసియా కప్‌ 2022లో భాగంగా భారత్‌-పాక్‌ జట్ల మధ్య నిన్న (ఆగస్ట్‌ 28) జరిగిన హైఓల్టేజీ పోరుపై పాకిస్థాన్‌ మాజీ స్పీడ్‌స్టర్‌ షోయబ్‌ అక్తర్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌-పాక్‌లు పోటీపడి మరీ చెత్తగా ఆడాయని, ఓడిపోయేందుకు ఇరు జట్లు సర్వశక్తులు ఒడ్డాయని, క్రికెట్‌లో ఇదో చీకటి రోజని వివాదాస్పద ఆరోపణలు చేశాడు. 

ఓడిపోయే ప్రయత్నంలో భారత్ దాదాపుగా విజయం సాధించిందని, అయితే హార్ధిక్ టీమిండియా ప్రయత్నాన్ని అడ్డుకున్నాడని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. పాక్‌ ఆటగాళ్లు జిడ్డు బ్యాటింగ్‌లో తమకు సాటే లేరన్నట్లుగా ఆడారని, ఇందుకు వారిని అభినందించకుండా ఉండలేమని చతుర్లు విసిరాడు. ఇరు జట్ల కూర్పు విషయంలోనూ అక్తర్‌ నోరు పారేసుకున్నాడు. పంత్‌ను పక్కకు పెట్టడంపై భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మను విమర్శించాడు. 

రోహిత్‌ అనునిత్యం ప్రయోగాలు చేస్తూ గాలివాటం విజయాలు సాధిస్తున్నాడని అన్నాడు. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు అధ్వానంగా ఆడాయని మ్యాచ్ అనంతరం తన యూట్యూబ్  ఛానెల్‌లో మాట్లాడుతూ అసంతృప్తిని వ్యక్తం చేశాడు. అక్తర్‌ చేసిన ఈ వ్యాఖ్యలపై ఇరు దేశాల అభిమానులు మండిపడుతున్నారు. అక్తర్‌ క్రికెట్‌ పరిజ్ఞానం లేని వ్యక్తి అని, అతని వ్యాఖ్యలపై స్పందించడం అనవసరమని కౌంటరిస్తున్నారు. పాక్‌ ఓడిందన్న వైరాగ్యంలో అక్తర్‌ ఇలాంటి పిచ్చి స్టేట్‌మెంట్స్‌ ఇస్తున్నాడని ఇండియన్‌ ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. 
చదవండి: ప్రత్యర్ధినైనా కోహ్లికి అభిమానినే.. ఆటోగ్రాఫ్‌ ప్లీజ్‌..!

మరిన్ని వార్తలు